Breaking News

గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

-గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం
-కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్న ముఖ్యమంత్రి
-పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు, కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం మూడు రోజుల కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. గుంటూరు, కుప్పంలో చేపట్టే మూడు రోజుల పర్యటనలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. నార్త్ అమెరికాలో స్థిరపడిన గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ కాలేజీ అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా – జింకానా పేరుతో ఏర్పాటు చేసుకున్న సంస్థ ద్వారా రూ. 100 కోట్ల విరాళాన్ని భవన నిర్మాణం కోసం అందచేశారు. 2018లో ఈ భవనానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయనే ఈ మాతా శిశు కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ మాతా శిశు కేంద్రంలో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ సహా ఇతర సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 27 కోట్లను కేటాయించింది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా సుమారు రూ. 690 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. శుక్రవారం మధ్యాహ్నం 02:35 గంటలకు కుప్పం చేరుకోనున్న ముఖ్యమంత్రి… తన తొలి రోజు పర్యటనలో భాగంగా రూ. 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రారంభించనున్నారు. అనంతరం రూ. 10 కోట్లతో నిర్మించనున్న ‘లెర్నర్స్ అకామిడేషన్’ ఫెసిలిటి సెంటర్… రూ. 2 కోట్లతో చేపట్టే ఓబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కుప్పంలోని స్వర్ణ నవదిశ సెంటర్‌లో లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్, ఆదిత్య బిర్లా మల్టీ-స్కిల్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఏటా 350 మంది యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ తీర్చిదిద్దారు. దీంతో పాటు… పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా కాంగుంది హెరిటేజ్ విలేజ్, బౌల్డరింగ్ పార్క్, పున్నమి రిసార్ట్‌లను ప్రారంభించనున్నారు. దీంట్లో భాగంగా కుప్పంలో రూ. 4 కోట్ల విలువైన సీఎస్ఆర్ నిధుల పర్యాటకాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

పెట్టుబడులపై ఎంఓయూలు… ఈ-సైకిళ్ల పంపిణీ

ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సీఎం వరుస సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బెగ్గులపల్లె పంచాయితీలో వివిధ వర్గాలకు సామాజిక భద్రత పెన్షన్లను స్వయంగా సీఎం పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం శనివారం సాయంత్రం 04:00 గంటలకు 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. వీటి ద్వారా రూ. 675.24 కోట్ల పెట్టుబడులు, సుమారు 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రూ. 200 కోట్లతో ఎంఏఎఫ్ క్లాతింగ్, రూ. 180 కోట్ల పెట్టుబడితో న్యూట్రీ ఫీడ్స్, రూ. 137.1 కోట్ల పెట్టుబడితో ఇన్-ఫేజ్ వరల్డ్ పార్క్ వంటి సంస్థలు కుప్పం కేంద్రంగా పరిశ్రమలు స్థాపించనున్నాయి. ఇవే కాకుండా మరో నాలుగు కంపెనీలతో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. ఇక కుప్పం నియోజకవర్గాన్ని ‘నెట్ జీరో’గా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతో పాటు, సుర్బానా జురాంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్ మరియు మోడల్ బస్ స్టాండ్ డిజైన్లను సీఎం సమీక్షిస్తారు. ఇక ఆదివారం పర్యటన చివరి రోజున పార్టీ కేడర్ తో సమావేశం కానున్నారు. అలాగే కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టీ అడ్వైజరీ కమిటీతో సమావేశమై… నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష చేపట్టనున్నారు. ఆదివారం సాయంత్రం మూడు గంటల తర్వాత ముఖ్యమంత్రి కుప్పం నుంచి అమరావతికి తిరిగి పయనం అవుతారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *