-వయోవృద్ధుల సంక్షేమ చట్ట స్పూర్తి ట్రైబ్యునళ్ల ఉత్తర్వుల్లో ఉట్టిపడాలి…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రేమ అప్యాయతల మధ్య వయోవృద్ధుల జీవితం కొనసాగించేలా చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరి కనీస భాధ్యత అని వయోవృద్ధుల సంక్షేమ చట్ట స్ఫూర్తి ట్రైబ్యునళ్ల ఉత్తర్వుల్లో ఉట్టిపడాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లాస్థాయి వయోవృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అప్పీలేట్ ట్రైబ్యునల్కు వచ్చిన క్లెయిమ్ల పరిష్కారంతో పాటు వయోవృద్దుల క్షేమం, సంక్షేమానికి రూపొందించిన కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ఏదో ఒకరోజు వృద్ధాప్యానికి చేరువ కావాల్సిందేనని.. ఈ రోజు మనం మన తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు అందిస్తున్నామో భవిష్యత్తులో మనకు కూడా అదేవిధంగా లభించే పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గుర్తించి వయోవృద్ధులకు ప్రేమను పంచుదామన్నారు. వయోవృద్ధులను ఇబ్బంది పెట్టేవారిపట్ల చట్టం ఓ కంట కనిపెడుతోందని వయోవృద్ధులకు రక్షణ కల్పిస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకునేలా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. వయోవృద్ధుల సంక్షేమం విషయంలో రెవెన్యూ, పోలీస్, సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 454 క్లెయిమ్లకుగాను ఇప్పటికే 392 క్లెయిమ్ ల పరిష్కారం జరగ్గా.. మరో 62 పెండింగ్లో ఉన్నాయని క్లెయిమ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను అదేశించారు.
సమావేశంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వి. కామరాజు, ఎసిపి కె.వెంకటేశ్వరరావు, డిఆర్డిఎ పిడి నాంచారరావు, డిప్యూటి డిఎంఅండ్హెన్వో ఇందుమతి, ఉమ్మడి కృష్ణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎం. వెంకటేశ్వరరావు, ట్రైబ్యునల్ సభ్యులు ఎన్. కామేశ్వరి, ఆర్ వెంకటేశ్వరరావు, ఎన్.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News