గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి పనుల్లో విభాగాల మధ్య సమన్వయం ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా పనులు నిర్దేశిత గడువు ప్రకారం నిబందనల మేరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం లక్ష్మీపురం, కృష్ణ నగర్, బృందావన్ గార్డెన్స్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోడ్ విస్తరణ పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై విభాగాధిపతులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రదానంగా రోడ్ల విస్తరణ పనులను వేగంగా చేపట్టకుంటే ప్రజలు ఇబ్బందులు పడతారని, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులపై అసంపూర్తిగా వివరాలు అందించిన ఏఈ, డిఈఈలపై అసహనం వ్యక్తం చేస్తూ, పనులను నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. మెయిన్ రోడ్ కావడం వలన డ్రైనేజి రోడ్ మీదకు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, విస్తరణకు అంగీకారం తెలిపిన, భవనాలు తొలగించిన ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యతపై పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని తామే నేరుగా తనిఖీ చేస్తామని, నాణ్యత లోపాలు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విస్తరణ పనులను నిర్దేశిత మాస్టర్ ప్లాన్ మేరకు చేపట్టాలని, ఇంకా ఎవరైనా ఒప్పుకోని వారు ఉంటే వారికి అవగాహన కల్గించి ఆమోదం తీసుకోవాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులపై మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు తప్పనిసరిగా పిన్ పాయింట్ ప్రోగ్రాం ప్రకారం పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే ప్రతి ఒక్క ఉద్యోగి సమగ్ర వివరాలు తెలుసుకొని ఉండాలని సూచించారు.
పర్యటనలో సిపి రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ మానం పద్మశ్రీ, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News