-సమాజానికి కొంత తిరిగి ఇచ్చినప్పుడే నిజమైన సంతృప్తి
-జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం
-పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టు
-పదేళ్లలో గుంటూరు సహా అమరావతి రూపురేఖలు మారతాయి
-గుంటూరు జీజీహెచ్ లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
-రూ.100 కోట్ల విరాళం సమకూర్చిన గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులకు సీఎం అభినందన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంత ఎదిగినా జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంపాదించిన దాంట్లో కొంత సమాజసేవకు వినియోగిస్తే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిదని సీఎం అన్నారు. గుంటూరు జీజీహెచ్ లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కానూరి-గుంటూరు మెడికల్ కాలేజీ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా మాతా శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణం కోసం రూ.100 కోట్ల విరాళాలను సమకూర్చగా… ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కోసం రూ. 27 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘సమాజంలో ఇంకా మంచి మిగిలే ఉందని ప్రవాసాంధ్రులు నిరూపించారు. సాధారణంగా నలభై, యాభై ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్లి స్థిరపడినవాళ్లు జన్మభూమిని మర్చిపోతారు. కానీ మీరంతా చదువుకున్న కాలేజీని గుర్తు పెట్టుకుని 1981లోనే జింఖానా సంస్థ ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. అందుకు మీ అందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆరోగ్య కేంద్రం నిర్మాణంతో పాటు భవిష్యత్ లో దాని నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు రాకుండా బ్యాంకులో కొంత సొమ్ము డిపాజిట్ చేయడం గొప్ప విషయం. మనతో పాటు సమాజం కూడా బాగుండాలన్నదే మన సంస్కృతి. ఇప్పటి వరకూ పాఠశాలలకు, ఆస్పత్రులకు, దేవాలయాలకు, సత్రాలకు, ఆట స్థలాలకు ఎంతోమంది దాతలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు మరే దేశంలోనూ కనిపించవు. అమెరికాలోనైతే 18 ఏళ్లకే పిల్లలు బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తారు. కానీ మనదేశంలో పిల్లలు ఎంత పెద్దవారైనా జీవితాంతం వారిని తల్లిదండ్రులు కనిపెట్టుకునే ఉంటారు. 1995లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడిసిన్ చేసిన ఎంతోమంది అమెరికా వెళ్లేవాళ్లు. ఇది చూసి చాలామంది నాతో..బ్రెయిన్ డ్రెయిన్ అవుతోందన్నారు. రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని వారికి చెప్పాను అని ముఖ్యమంత్రి అన్నారు.
పేదల అభ్యున్నతి కోసం పీ4
నేను జన్మభూమి కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఎంతోమంది ప్రవాసాంధ్రులు తాము పుట్టి పెరిగిన ఊరికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మనందరం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కుటుంబాల్లో పుట్టినవారమే. అవకాశాలు అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగాం. రహదారులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ రంగంలో వేగవంతమైన అభివృద్ధికి పీ4 మోడల్ సరైందని కేంద్రం భావిస్తోంది. అయితే ధనిక, పేదల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. నేను అందుకే పేదల అభ్యున్నతి కోసం పీ4 తీసుకొచ్చాను. పేదలు సంపాదించే స్థాయికి చేరితేనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. చదువు అనేది గేమ్ ఛేంజర్. అంబేద్కర్, అబ్దుల్ కలామ్ ఆర్ధిక సాయంతోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. పీ4 కార్యక్రమం లక్ష్య సాధనలో 50 శాతం రీచ్ అయ్యాం. 10 లక్షల 42 వేల మందిని లక్షా 2 వేల మంది దత్తత తీసుకున్నారు. ప్రవాసాంధ్రులు కూడా పేదలకు ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
దాతృత్వం గొప్పది
‘గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వారిలో 8 మందికి పద్మశ్రీలు రావడం గొప్ప విషయం. మన రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ తర్వాత ఏర్పాటైన రెండవది గుంటూరు మెడికల్ కాలేజీనే. జీజీహెచ్ లో మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. మొత్తంగా 600 బెడ్లు ఈ బ్లాకులో ఉన్నాయి. ప్రసూతి విభాగం 300 బెడ్లు, పిడీయాట్రిక్స్ విభాగంలో 200 బెడ్లు, ఇక NICU, SICU, PICU వంటి విభాగాల్లో మిగిలిన బెడ్లు ఉన్నాయి. నిర్మాణం కోసం డాక్టర్ గవిని ఉమాదేవి రూ.22 కోట్లు, నళిని-వెంకట్ తేళ్ల రూ.8 కోట్లు, వాసిరెడ్డి రమాదేవి-కొండ్రగుంట వెంకట్రావు రూ. 4.32 కోట్లు, మొవ్వ వేదవతి-వెంకటేశ్వరరావు రూ. 4.04 కోట్లు, డాక్టర్ తేలికిచర్ల-గుడిమెడ కుటుంబాలు రూ. 3.60 కోట్లు, డాక్టర్ లక్ష్మీ-చౌదరి గంగ రూ.3.40 కోట్లు, బీనా నూతక్కి-గోపాలరావు రూ.3.20 కోట్లు ఇచ్చారు. పూర్వ విద్యార్థులు ఈ బ్లాక్ నిర్మాణంతో పాటు… గతంలో రూ.35 కోట్లను వెచ్చించి ఆడిటోరియం నిర్మించారు తులసీ సీడ్స్ సహా పలువురు దాతలు ముందుకొచ్చారు. గుంటూరు ఎంపీ , కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.80 కోట్ల వరకూ విరాణాలు సేకరించి పనులు పూర్తి చేస్తున్నారు. నాట్కో కూడా 2017-18లో రూ. 47 కోట్లు , ఈ ఏడాది రూ.18 కోట్లు, క్యాన్సర్ చికిత్సకు రూ. 18 కోట్లు, ఇతరత్రా అవసరాలకు రూ. 12 కోట్లు ఖర్చు చేశారు. అలాగే గుంటూరులో మిలీనియమ్ బ్లాక్ కోసం రూ. 16 కోట్లు, విశాఖ ఏయూ మెడికల్ కాలేజీ బ్లాక్ నిర్మాణం కోసం రూ. 60 కోట్లు, కాకినాడ ఆస్పత్రికి రూ. 40 కోట్లు, కర్నూలు మెడికల్ కాలేజీకి రూ, 20 కోట్లు ఖర్చు చేయడం అభినందనీయం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
మేటి నగరంగా అమరావతి
అమరావతి నూతన గ్రీన్ ఫీల్డ్ నగరంగా అవతరిస్తోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వేలో స్పష్టం చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2038 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం తయారవుతుంది. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనతో మనం ముందుకెళ్తున్నాం. రాజధానికి అంత భూమి ఎందుకు, 100 ఎకరాల్లో సచివాలయం కట్టేస్తే చాలని ఎంతోమంది అన్నారు. కానీ జాతికి గుర్తింపు లభించాలన్నా, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలన్నా అభివృద్ధి చెందాలి. కర్ణాటక రాష్ట్రానికి బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై , తెలంగాణకు హైదరాబాద్ నగరాలున్నాయి. మనం అమరావతిని చిన్న నగరంగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతాం. అందుకే హైదరాబాద్ కంటే మెరుగైన నగరం కట్టాలని నిర్ణయించాం. ఈ 30 ఏళ్లలో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి జరిగింది. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి. అమెరికాలో సిలికాల్ వ్యాలీ ఉంది… మరి ఇండియాలో ఏముందని అడిగే వారికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉందన్నదే మన సమాధానం. ఆనాడు సైబరాబాద్ నిర్మించాం. నేడు క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు ఇళ్లలో కరెంటే ఉండేది కాదు ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. 1999లో నాటి అసెంబ్లీలో కరెంటు గురించే గంటల కొద్దీ చర్చలు జరిగేవి. అప్పుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. విద్యుత్ రంగంలో మన దేశం నెంబర్ వన్ గా ఉండటం గర్వకారణం. అమెరికాలో కూడా నాలుగు గ్రిడ్ లు ఉండగా… ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం మనదే. సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజీకి శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పదేళ్లలో గుంటూరు సహా అమరావతి ప్రాంత రూపురేఖలు ఎలా మారతాయో మీరే చూస్తారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయి. 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. రెన్యువబుల్ ఎనర్జీ ఉంటుంది. పొల్యూషన్ మాటే వినపడదు. 1995లో ఐటీని , 2000లో బయో టెక్నాలజీని ప్రమోట్ చేశాము. ఆనాడు జినోమ్ వ్యాలీకి భూములిచ్చి ప్రోత్సహించగా ఆ తర్వాత కాలంలో భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ అక్కడి నుంచే తయారు చేసిందని సీఎం అన్నారు.
రాష్ట్రమంతటా సంజీవని
టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. కుప్పంలో పైలట్ ప్రాజెక్టు అయింది. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించి రోల్ మోడల్ గా మారుస్తాం. కుప్పంలో 70 వేల మందికి క్లినికల్ టెస్టులు చేశాం. 2026లో డిజిటల్ హెల్త్ రికార్డులు చేయడమే కాకుండా 72 లక్షలమంది రోగుల డేటా తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం. నేడు కార్పొరేట్ ఆస్పత్రులు ఫైవ్ స్టార్ హోటళ్లను మించిపోతున్నాయి. రోగి చికిత్స ఖర్చు కంటే రూమ్ ఖర్చే ఎక్కువవుతోంది . త్వరలో ఎయిర్ అంబులెన్స్ లు వస్తున్నాయి. 2026లో డ్రోన్ అంబులెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నాం. ప్రవాసాంధ్రులు అమెరికా నుంచి వర్చువల్ గా లేక ఇక్కడికి వచ్చినప్పుడు కానీ పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేసి, మెరుగైన వైద్య సేవలకు తగిన సూచనలు చేయాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News