– బీసీలు రెండుకులనాయకుల కపట ప్రేమలకు పడిపోవద్దు
– రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయ కర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు కులాలు అధికారమే లక్ష్యంగా .. రాజకీయమే వృత్తిగా మార్చుకుని వారసత్వ రాజకీయాలతో .. అనాధిగా చేస్తున్న కుట్రలపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ పదునైన వ్యూహాలతో అడుగులేస్తేనే బీసీలకు రాజ్యాధికారం సాకారమవుతుందని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయ కర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ.. గవర్నర్పేటలోని బాలోత్సవ్ భవన్లో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ మేధో మథనం’ సదస్సుకు ఆయన హాజరయ్యారు. బీసీ చైతన్యవేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుల స్పృహ లేకపోతే బీసీ కులాలు ఏకతాటిపైకి రాలేరన్నారు. కులాల వారీగా చీల్చి రెండు కులాలు చూపే కపట ప్రేమకు అయోమయంలో పడి బీసీలు ఆగమాగం కావొద్దన్నారు. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (కులనిర్మూలన) ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ అనే డాక్యుమెంట్ ను చదవాలన్నారు. అంబేద్కర్ ఒక ఎస్సీల అభ్యున్నతికే బాటలు వేశారని అనుకోవడం సరికాదని, ఆయన బహుజనుల కోసం పోరాడాడని అర్థం చేసుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని పెరియార్ తమిళనాడులో ద్రవిడ కళగం రూపంలో కల్పించి విజయం సాధించారన్నారు. అక్కడ బ్రాహ్మణ ముఖ్యమంత్రి జయలలిత అయినా.. కానీ పాలనా అంతా బహుజనవాదంతోనే సాగిందన్నారు. మనోళ్లు కాని వారిని మనోళ్లు అనుకుంటున్నాం. మనోళ్లు అయినవారిని కాదనుకుంటున్నామని, ఇంటి పేరు మారినా కులం పేరు మారదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్గారు, బీసీ చైతన్యవేదిక జాతీయ సలహాదారులు అక్కల బాబూగౌడ్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మానేపల్లి వీవీఎస్ఎన్మూర్తి, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్వీ రావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News