-శాప్ చైర్మన్ రవి నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సమావేశంలో భాగంగా, ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ (Khelo India Mission) ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత హర్షదాయకమని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే దశాబ్ద కాలంలో భారత క్రీడా రంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఈ మిషన్ రూపుదిద్దుకోవడం ప్రశంసనీయమని అన్నారు. క్రీడా రంగాన్ని కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేయకుండా, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలకు బలమైన వేదికగా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
‘ఖేలో ఇండియా మిషన్’ ద్వారా అట్టడుగు స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతో ఆశాజనకమని రవి నాయుడు తెలిపారు.
అదేవిధంగా కోచ్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన, నిరంతర క్రీడా పోటీల నిర్వహణ వంటి అంశాలపై ఈ మిషన్ ప్రధానంగా దృష్టి సారించడం క్రీడా రంగానికి మరింత ఊపునిస్తుందని ఆయన అన్నారు.
2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధమవుతున్న ఈ కీలక సమయంలో, ‘ఖేలో ఇండియా మిషన్’ దేశానికి అవసరమైన నాణ్యమైన క్రీడాకారుల తయారీలో కీలక పాత్ర పోషిస్తుందని శాప్ చైర్మన్ రవి నాయుడు అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భారత క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News