-పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ప్రజా సమస్య అర్జీని కాలపరిమితిలోగా తప్పనిసరిగా పరిష్కరించాల్సిందేనని ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సగటు కంటే ముందే అర్జీలను పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తాము సమర్పించిన అర్జీల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 1100 నంబర్కు ఫోన్ చేసి తమ అర్జీల యధార్థ స్థితిని తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని క్షేత్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అర్జీల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రతి అర్జీపై క్షుణ్ణంగా పరిశీలన చేసి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వేదికలను ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రాబేషనరీ) కృష్ణ చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News