గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ (జిటిఎస్)ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం ఏటుకూరు రోడ్ లోని జిటిఎస్ నిర్మాణ ప్రాంతం, ఎంఆర్ఎఫ్ సెంటర్, పొన్నూరు రోడ్ లోని వీధి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రం, బుడంపాడు చెరువులను అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సేకరించే వ్యర్ధాలను సమర్దవంతంగా నిర్వహించడానికి జిటిఎస్ లు కీలకమని, అటువంటి వాటి నిర్మాణం వేగంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిటిఎస్ లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎస్ఈ ని ఆదేశించారు. ఏటుకూరు రోడ్ లోని యార్డ్ లో ఇళ్ల నుండి వచ్చే హానికర వ్యర్ధాలను డిస్పోజ్ చేసే మెషిన్ కి షెడ్ ఏర్పాటు చేయాలని, వుడ్ చిపింగ్ మెషిన్ ని రన్నింగ్ లోకి తీసుకురావాలన్నారు. మెటీరియల్ రికవరీ ఫెసిలిటి సెంటర్ కి ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేయాలని ఈఈని ఆదేశించారు. పొన్నూరు రోడ్ లో ఏర్పాటు చేస్తున్న ఏబిసి సెంటర్ ని పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని, త్వరలో సెంటర్ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం బుడంపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ని పరిశీలించి, ట్రాక్ ని గతంలో అర్బన్ గ్రీనింగ్ కార్పోరేషన్ అభివృద్ధి చేసినట్లు తెలుసుకొని, స్థానిక ప్రజల కోరిక మేరకు ట్రాక్ ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు, గతంలో చేపట్టిన పనుల వివరాలను అందించాలని ఈఈని ఆదేశించారు.
పర్యటనలో సిపి రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, డిసిపి సూరజ్, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణు, వేణు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News