-భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ..
-ఆర్డీవో కె. మాధురి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రైతులు ప్రజల హక్కులకు భరోసా కల్పిస్తూ భూ హక్కుల పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు ఆర్డీవో కె. మాధురి అన్నారు. తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తిరువూరు మండలం లక్ష్మీపూరం గ్రామంలో మంగళవారం ఆర్డీవో కె. మాధురి గ్రామ సభ నిర్వహంచి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్డివో మాధురి మాట్లాడుతూ భూమిని నమ్ముకుని బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం అనేది ప్రథమ కర్తవ్యం కావాలని నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని అధికార్లు పని చేసి రైతులకు కొత్త పట్టాదారుల పుస్తకాలు పంపిణీ చేయడంలో భాగస్వాములు కావడం జరిగిందన్నారు. రైతులకు సంబంధించిన పాత పుస్తకాలు బ్యాంకులో ఉంటే రెవిన్యూ సిబ్బంది స్వయంగా వెళ్ళి పాత పుస్తకాలు రద్దు అయ్యాయని వాటిస్థానంలో క్రొత్తపుస్తకాలు ఇస్తున్నామని, పాతవి తీసుకుని క్రొత్త పాసుపుస్తకాలు రైతులు సమక్షంలో బ్యాంకు అధికార్లకు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం లక్ష్మీపూరం గ్రామంలో చౌకధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిత్యావసర వస్తువుల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అనంతరం విజయ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ (రైస్ మిల్)సు తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు రికార్డుల నిర్వహణ పరిశీలించి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అక్రమాలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కె. మాధురి తెలిపారు. కార్యక్రమంలో తిరువూరు తహశీల్దార్ వై. నాగమణి, పిడిఎస్ డిప్యూటీ తహశీల్దార్ శ్వేత, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News