-కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడి
-ఆంధ్రప్రదేశ్లో సౌర లైట్లు గిరిజన గృహాల విద్యుదీకరణపై ప్రశ్నించిన ఎంపీకేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ లేని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ( పి.బి.టి.జి) గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.0.36 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం రూ.44.1 కోట్లు మంజూరు కాగా, రూ.23.8 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు.
లోక్ సభలో బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్లో సౌర లైట్లు గిరిజన గృహాల విద్యుదీకరణ, వాటి నిధుల మంజూరు అంశంపై నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించిన దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (DDUGJY),
2017 అక్టోబర్లో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య), 2021లో ప్రారంభించిన పునరుద్ధరిత పంపిణీ రంగ పథకం (RDSS) ద్వారా రాష్ట్రాలకు విద్యుత్ అందించడంలో సహకరిస్తోందన్నారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన , సౌభాగ్య పథకాల కింద, విద్యుత్ కావాలనుకున్న అన్ని గృహాలకు 31 మార్చి 2019 నాటికి విద్యుదీకరణ పూర్తయ్యిందని, . సౌభాగ్య పథకం కింద మొత్తం 2.86 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.. ఈ రెండు పథకాలు 31.03.2022 నాటికి ముగిసినట్లు పేర్కొన్నారు. ఇక ఆర్.డి.ఎస్.ఎస్. పథకం కింద మిగిలిపోయిన 13.65 లక్షల గృహాలకు రూ. 6,521 కోట్ల విలువైన ఆన్-గ్రిడ్ విద్యుదీకరణ పనులకు అనుమతి ఇవ్వబడిందన్నారు..
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ లేని గృహాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు వుందంటూ ఏపీలో విద్యుత్ లేని గృహాలకు విద్యుత్ సౌకర్యాలు కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల వివరాలను వెల్లడించారు. ఆర్.డి.ఎస్.ఎస్. (Revamped Distribution Sector Scheme) పథకం కింద ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయిన 15,475 గృహాలకు విద్యుదీకరణ మంజూరు చేయగా, వాటిలో 15,319 గృహాలకు ఇప్పటికే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లాల్లో ఈ విద్యుదీకరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో సౌర వీధి దీపాల ఏర్పాటులో భాగంగా అజేయ్ పేజ్ -2 (Ajay Phase–II) పథకం కింద విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మొత్తం 5,500 సౌర లైట్లు పూర్తిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆఫ్ -గ్రిడ్ సోలార్ పేజ్ -3 (Off-grid Solar Phase–III) కింద నెల్లూరు, విశాఖపట్నం, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు 1,968 సౌర లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం కలిపి రాష్ట్రానికి 12,000 సౌర వీధి దీపాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా సున్నితమైన గిరిజన వర్గాల (PVTG) గృహాల కోసం పి.ఎమ్-జన్మన్ (PM–JANMAN) పథకం కింద సౌర ఆఫ్-గ్రిడ్ విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పర్వతీపురం మన్యం జిల్లాల్లో 1,675 గృహాలకు సౌర వ్యవస్థలు మంజూరు కాగా, ఇప్పటివరకు 967 గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.
Prajavartha Online Telugu News