-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేతలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టంచేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం ఏపీ పద్మశాలీ సంఘం, చేనేత సంఘ ప్రతినిధులు వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిశారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితను దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వాల పాలనలోనే చేనేతకు స్వర్ణయుగమన్నారు. ఆనాడు ఎన్టీఆర్… నేతన్నలకు అండగా నిలిచారన్నరాు. నేడు సీఎం చంద్రబాబునాయుడు చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో నేతన్నల కష్టాలను మంత్రి నారా లోకేశ్ ప్రత్యక్షంగా చూశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, చేనేతలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, ఎన్నికల హామీలను నెరవేర్చుతున్నారన్నారు. నేతన్నలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. నూలు కొనుగోలుపై 15 శాతం రాయితీ అందజేస్తున్నామన్నారు. జనవరిలో చేనేత సహకార సంఘాలకు రూ.7 కోట్ల బకాయిలు అందజేశామని, రూ.1.67 కోట్ల త్రిఫ్ట్ నిధులు ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుందన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయనున్నామన్నారు. ఈ పథకం వల్ల 1,03,454 కుటుంబాల్లో నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరనుందన్నారు.రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకాయంలో టెక్స్ టైల్స్ పార్కులు, మెగా క్టస్లర్లు, క్లస్టర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వం, సీఎ చంద్రబాబునాయుడు ప్రధాన లక్ష్యమన్నారు. అంతకుముందు ఏపీ పద్మశాలీ సంఘ ప్రతినిధులు మంత్రి సవితను కలిసి, పలు సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. వచ్చే ఏప్రిల్ 26న మంగళగిరిలో పద్మశాలీ రాష్ట్ర మహా సభ నిర్వహించనున్నామని, ఆ సభలో పాల్గొనాలని మంత్రి సవితను ఆహ్వానించారు. ఇందుకు మంత్రి సవిత సుముఖం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలీ సంఘం, చేనేత సంఘ ప్రతినిధులు జె.శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, వెంకట సాంబశివరావు, కొల్లి బాబూరావు, గౌరీ శంకర్రావు, తుమ్మలచర్ల గణపతి ఉన్నారు.
Prajavartha Online Telugu News