Breaking News

వ్యవసాయ, అనుబంధ శాఖ‌ల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించండి

– ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతన్నలకు బలమైన అండగా నిలిచేలా వ్యవసాయ, అనుబంధ శాఖ‌ల‌ అభివృద్ధికి, అలాగే రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించే దిశగా వ్యవసాయ మరియు పశుసంవర్థక శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ ఉత్పాదకత వృద్ధి, ఆధునిక సాంకేతికత అమలు, పశుసంవర్థక రంగ విస్తరణ వంటి అంశాలకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వ్యవసాయ, అనుబంధ శాఖల పరిధిలో ముఖ్యమైన కార్యాలయ భవనాలు, మౌలిక వసతుల నిర్మాణం, కొనసాగుతున్న మరియు ప్రతిపాదిత ప్రాజెక్టుల అమలుకు అదనపు నిధులు అవసరమని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల కోసం అదనపు బడ్జెట్ కేటాయింపులు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఈ విజ్ఞప్తిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందిస్తూ, రైతు సంక్షేమం, వ్యవసాయ, పశుసంవర్థక రంగాల అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. రాబోయే బడ్జెట్‌లో ఈ రంగాలకు తగిన నిధులు కేటాయించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *