-శ్రీవారి పవిత్రత దెబ్బతీసేందుకే కుట్ర
-కల్తీ నెయ్యి సరఫరాపై 2022లో వచ్చిన నివేదికను తొక్కిపెట్టారు
-భగవంతుడు అంటే లెక్క లేదు…హిందూమతం పట్ల విశ్వాసం లేదు
-ఈ వ్యవహారాన్ని వదిలి పెట్టం..దోషులపై చర్యలు తీసుకుంటాం
-కల్తీ వ్యవహారంలో తప్పును అంగీకరించకపోగా క్లీన్ చిట్ అంటూ తప్పుడు ప్రచారం
-కరడు గట్టిన నేరస్తులే అసత్యాన్ని నమ్మించే ప్రయత్నిం చేస్తారు
-ఎన్డీఏ కూటమి హిందువుల సెంటిమెంట్ను పరిరక్షిస్తుంది
-కూటమి తరపున ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం
-మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంతో డబ్బు దోచుకోవడంతో పాటు శ్రీవారి పవిత్రత దెబ్బతీయాలనేదే అసలైన కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భగవంతుడు అంటే లెక్క లేదు… హిందూమతం అంటే విశ్వాసం లేదని, కల్తీ నెయ్యి వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో గత పాలకులు మహా పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రులు లోకేష్, సత్యకుమార్, పార్థసారధి, ఆనం రామనారాయణరెడ్డి, కేశవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…”తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం ప్రజలు, భక్తుల మనోభావాలకు సంబంధించింది. గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుంది. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అని నాడు అన్నారు. గత పాలనలో తిరుమల విషయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. 2022లో సీఎఫ్టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పినా పట్టించుకోకుండా యథేఛ్చగా కొనసాగించారు. లక్షల మంది భక్తులకు అదే కల్తీ నెయ్యిని వాడిన లడ్డూను ప్రసాదంగా ఇచ్చి గత పాలకులు మహా పాపానికి పాల్పడ్డారు. గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదం తినాలంటేనే భక్తులు భయపడిన పరిస్థితి. మానసికంగా ఇబ్బందులు పడ్డారు. 2022లో వచ్చిన నివేదికను తొక్కిపెట్టారు. ఉద్దేశపూర్వకంగా అక్రమాలు చేయడానికే గత పాలకులు నాటి నివేదికను దాచేశారు. గతంలో పని చేసిన చైర్మన్ పీఏ రూ.4 కోట్ల డబ్బులు లంచంగా తీసుకున్నారు”అని సీఎం వెల్లడించారు.
*నాడు తెలిసే తప్పు చేసి..నేడు ఎదురు దాడి*
“అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకున్నాం. నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిళ్లు తీయించాం. శాంపిళ్లు తీసి ఎన్డీడీబీకి పంపాం. ఇక సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసింది. భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారు. హైందవం పట్ల జగన్ కు విశ్వాసం లేదు. తిరుమల లడ్డూ విషయంలో దుర్మార్గం, మహాపాపం చేశారు. చరిత్రలో శ్రీవేంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదు. బ్రిటీషర్లు కూడా సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించారు. వాళ్లకంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారు. నాడు లడ్డూ కల్తీకి పాల్పడిందే కాక ఇప్పుడు మళ్లీ ఎదురుదాడి చేసి, జరిగిన ఘటనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ నివేదికలో కల్తీలేదని ఎక్కడా నిర్ధారించలేదు. కరడు గట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మించాలో ప్రయత్నిస్తారు. ఇప్పుడు వైసీపీ అదే పని చేస్తోంది. ఏ ల్యాబ్లో అయినా ఒకే తరహా నివేదిక వచ్చింది. టీటీడీ బోర్డు చైర్మన్ కు, పర్చేజ్ కమిటీకి తెలిసే ఈ నిర్ణయాలు జరిగాయి. ఇప్పుడు వాళ్లే ఎదురు దాడి చేస్తున్నారు. దౌర్జన్యం, రౌడీయిజం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవు. గత పాలనలో అంతర్వేది రథం తగలబెడితే, రామతీర్ధంలో విగ్రహం ధ్వంసం చేస్తే చర్యలు తీసుకోకుండా తిరిగి మాపైనే ఆరోపణలు చేశారు. బూతులు తిట్టినా భరించాను. వారు ఏం చేసినా నిస్సహాయంగా మిగిలిపోవాలా? నాడు వివేకానందరెడ్డిని హత్య చేసి నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు శ్రీవారి ప్రసాదం కల్తీ చేసి మళ్లీ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల విశ్వాసం, నమ్మకంపైనా దాడి చేస్తున్నారు” అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
*పరకామణి చోరీని సెటిల్మెంట్లు చేస్తారా?*
“జగన్ మోహన్ రెడ్డికి వేంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటే డిక్లరేషన్ పై ఎందుకు సంతకం పెట్టలేదు.? అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ పై సంతకం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే. డిక్లరేషన్ ఇవ్వకుండా ఇష్టానుసారం వ్యవహరించిన వ్యక్తులు మాపై నిందారోపణలు వేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన దోషులు ఎవరైనా, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వారిని ఉపేక్షించే సమస్యే లేదు. మానవ సేవే..మాధవ సేవ అంటాం. అలాంటి ఆ భగవంతుడి ప్రసాదాన్నే కల్తీ చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీయడానికి కావాలనే చేసిన పనిగా మేం భావిస్తున్నాం. పామాయిల్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ లాంటి రసాయనాలు ప్రసాదంలో ఉన్నప్పుడు మహాపాపం కాదా? ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడానికి వీళ్లెవరు. ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తారా.? ఇష్టప్రకారం చేస్తాను అనే వ్యక్తులకు ప్రజలే సమాధానం చెబుతారు. 219 ఆలయాలపై గత పాలకులు దాడి చేసి అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. శ్రీవారి పరకామణిలో చోరీ కేసులో సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారా.? ఇదెక్కడి విడ్డూరం? జరిగిన తప్పును సమర్ధించేసి సెటిల్ చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తులను ఏమనాలి..? నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని నివేదికలో ఎక్కడుంది..? ఏమైనా కలకన్నారా.? క్షమించరాని మహాపాపం చేశారు. ఈ మహాపాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేం. ఉద్దేశపూర్వకంగానే శ్రీవేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేయడానికి కుట్ర చేశారు. అన్ని నివేదికలనూ ప్రజల ముందే ఉంచుతాం. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఈ తరహా విషయాలను ముక్తకంఠంతో ఖండించాలి. తిరిగి ఈ తరహా మహాపచారం చేయాలంటే భయపడాలి. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోం. దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. తిరుమల పవిత్రతను కాపాడతాం, అదే మాధవ సేవ. ఈ అంశంపై పీఠాధిపతులలోనూ చర్చించి ముందుకు వెళ్తాం.”అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
*బూతులు తిడితే సహించాలా?*
“ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే సహించాలా.? అసెంబ్లీలో నా కుటుంబంపై మాట్లాడిన బూతుల కారణంగా జీవితంలో తొలిసారి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్లీ అదే తరహా నన్ను విమర్శిస్తున్నారు. బూతులు తిట్టిన వారిని వెనకేసుకొస్తున్నారు. ఇదీ వారి నైజం. నేను శ్రీ వారి భక్తుడ్ని. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. 2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టాం. శ్రీవారి కృపతోనే 23 క్లైమోర్ మైన్స్ దాడి నుంచి బయపడ్డాను. శ్రీ వేంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మ ఇచ్చారు”అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Prajavartha Online Telugu News