– ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి
– అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లాస్థాయి కార్యక్రమానికి 145 అర్జీలు వచ్చాయని.. ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రెవెన్యూ, రెవెన్యూయేతర అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో 62 రెవెన్యూ అర్జీలు, 83 రెవెన్యూయేతర అర్జీలు వచ్చాయి. రెవెన్యూయేతర అర్జీల్లో పురపాలక శాఖకు 24, పోలీసు శాఖకు 18, డీఆర్డీఏకు 7, గృహనిర్మాణానికి ఆరు అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్కు 4, వ్యవసాయ, ఆరోగ్య శాఖలకు మూడు చొప్పున అర్జీలు అందాయి. విద్య, మార్కెటింగ్, విభిన్న ప్రతిభావంతులు, రహదారులు-భవనాలు, ఆర్ఐవోకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. విద్యుత్, ప్రజా రవాణా, ఎండోమెంట్, పశుసంవర్థక, డ్వామా, అడవులు, గ్రామీణ నీటి సరఫరా, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు ఒక్కో అర్జీ వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. రెవెన్యూ మరియు రెవెన్యూయేతర దరఖాస్తులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి కృషిచేయాలన్నారు.
Prajavartha Online Telugu News