తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తో పాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ప్రజారంజక బడ్జెట్ అని వారు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ బడ్జెట్లో మూలధన వ్యయానికి 16 శాతం కేటాయించడం ద్వారా అభివృద్ధికి బలమైన పునాది వేసినట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమతుల్యత ఇవ్వడం ఈ బడ్జెట్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ 2026–27 బడ్జెట్ను “రాష్ట్ర పునర్నిర్మాణానికి రూపొందించిన కార్యాచరణ పత్రం”గా అభివర్ణించారు. “ఇది కేవలం ఆదాయ–వ్యయాల లెక్కలు కాదు… ఇది అభివృద్ధి–సంక్షేమ సమతుల్యానికి ప్రతిబింబం” అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పరిపాలనా అనుభవం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలబెట్టిందని కొనియాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ప్రోత్సాహం, ఐటీ మరియు పారిశ్రామిక రంగాల విస్తరణలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తున్నాయని తెలిపారు. పారదర్శక పాలన, ఆర్థిక క్రమశిక్షణ, పరిపాలనా సంస్కరణలు రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే పథకాల అమలులో ఆయన చూపుతున్న నిబద్ధత ఆదర్శనీయం అని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల బలోపేతం, పారదర్శక అమలు విధానాలు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంపై ఆయన చూపుతున్న చిత్తశుద్ధి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని అన్నారు. విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషిని కొనియాడుతూ, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, డిజిటల్ విద్యా వసతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యువతకు కొత్త అవకాశాలను తెరుస్తాయని తెలిపారు. మూలధన వ్యయానికి 16 శాతం కేటాయించడం రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ, “ప్రజలు అభివృద్ధిని చూస్తారు… పనితీరును చూస్తారు. రాజకీయ ఆరోపణలు తాత్కాలికం, అభివృద్ధి శాశ్వతం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చివరగా, “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేసే ప్రజల బడ్జెట్” అని డా. హరిప్రసాద్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News