-మంచి పనులకు దాతల సాకారం ఉంటుదనడానికి సైకిళ్ల పంపిణీ నిదర్శనం
-దాతల సాయంతో త్వరలోనే పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లు
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 8 వేలకు పైగా విద్యార్థులకు ఉచితంగా అందజేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ మండలంలోని వేమవరం ఉన్నత పాఠశాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు పర్యటించి 44 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే కొందరు పేద విద్యార్థులకు కూడా సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు 8 వేలకు పైగా సైకిళ్లను దాతల సహకారంతో ఉచితంగానే విద్యార్థులకు అందించగలిగామన్నారు. ఇందులో ఒక వెయ్యి సైకిళ్లను తమ కంపెనీ తరుపున విద్యార్థులకు అందించడంపై మంత్రి గొట్టిపాటి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే అన్ని పనులూ చేయలేవన్న మంత్రి., మంచి పనులు చేస్తుంటే ప్రజలు కూడా సహకరిస్తారనడానికి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనమన్నారు. విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వడం చూసిన ఒక దాత పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తనకు రూ.12 లక్షలు ఇచ్చారని వెల్లడించారు. ఈ డబ్బుతో 8 పాఠశాలల్లో త్వరలోనే రక్షిత తాగునీటి ప్లాంట్ల నిర్మాణం చేపడతామని చెప్పారు.
గత వైసీపీ హయాంలో తన నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనే సమయంలో ఒక తండ్రి వేసిన ప్రశ్న తనను ఎంతగానో ఆలోచింపచేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమం సందర్భంగా అక్కడకు వెళ్లిన తనను.., ఇంట్లో ఒక్కరి చదువుకే అప్పటి వైసీపీ ప్రభుత్వం డబ్బులేసింది., ఇంకో పిల్లాడిని కూలికి పంపాలా అంటూ ఆ తండ్రి వ్యక్తం చేసిన ఆవేదనను తాను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. అప్పటికే ఇటువంటివి అనేకం ఆయన దృష్టికి రావడంతో పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని విద్యార్థులందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. తల్లికి వందనం అమలు కోసం ఒకే రోజు రూ.10,000., కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. రాజకీయాలు ఉండకూడదు, విద్యాలయాలు బాగుపడాలని ఎటువంటి గుర్తులు లేకుండా బ్యాగులు, యూనిఫాం, పుస్తకాలను విద్యా సంవత్సరంలో సకాలానికే పిల్లలకు అందిస్తున్నారని వివరించారు. సైకిళ్ల పంపిణీ సమయంలోనూ వాటికి పచ్చ రంగు వేయాలని కొందరు సూచించగా తాను వద్దన్నానని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. చదువుకుంటే వారికే అన్నీ అవగాహనకు వస్తాయని చెప్పానన్నారు. ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ఏం చేస్తున్నారో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే అసెంబ్లీ సమావేశాలు చూడటానికి పాఠశాల విద్యార్థులకు అనుమతులు ఇచ్చారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News