మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకొని జిల్లాలోని ముస్లిం లు ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా వారు నివసించే ప్రాంతాలు, మసీదులు ప్రార్థన మందిరాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచినీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల్లోనూ మసీదులు, ప్రార్థన మందిరాలలో వద్ద మంచినీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలన్నారు. మసీదులు, ప్రార్థన మందిరాలు, ఈద్గాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో పనిచేసే కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ముస్లిం ఉద్యోగులు అందరూ పవిత్ర రంజాన్ మాసంలో నమాజ్ చేయుటకు వీలుగా ఈనెల 19వ తేదీ వరకు అన్ని పని దినాలలో ముగింపు సమయానికి ఒక గంట ముందుగా సంబంధిత కార్యాలయము లేదా పాఠశాలను వదిలి వెళ్ళుటకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ వివరించారు. ముస్లింల సౌకర్యం కోసం రాత్రులు అంగళ్ళు, కూరగాయల మార్కెట్లు, హోటల్లు తెరిచి ఉంచేలా పోలీసులు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. ఈ జూమ్ సమావేశంలో , జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రబ్బాని, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు సాంబశివరావు,బాలసుబ్రమణ్యం, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, డిఎస్ఓ మోహన్ బాబు, జెడ్పిసిఈఓ కన్నమ నాయుడు, డిపిఓ అరుణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, కార్మిక శాఖ అధికారి విష్ణు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసు రత్నం, డిఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News