-పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలు చేపట్టడమైందన్న మంత్రి కొండపల్లి
-స్థానిక అధికారులకు అందుబాటులో ఉంటూ, అధికారిక మీడియా సమాచారాన్ని ఫాలో కావాలి: మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఆయా దేశాల్లో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ కూడా, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేసారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరూ నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరియు భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, కావున సరైన సమాచారం తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గగనతలంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమానాల రవాణా ఆలస్యం అవుతోందని, త్వరలోనే విమానయాన సేవలు పునరుద్దరిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర పౌరులను మంత్రి కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇస్తున్న ఆదేశాలు, సూచనల మేరకు, ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరినీ కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులలో ఏపీ ఎన్నార్టీ హెల్ప్ లైన్ నెంబర్లు +91 8500027678, +91 0863 2340678 నంబర్లకు, మరింత సమాచారం కోసం https://apnrts.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా, స్థానిక అధికారులు, అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే ఫాలో కావాలని మంత్రి కోరారు.
Prajavartha Online Telugu News