– మెటీరియల్ డిజిటల్ ట్యాబ్లను సద్వినియోగం చేసుకోండి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రఖ్యాత పోటీ పరీక్షల్లో విజయాన్ని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ అభ్యర్థులకు చేయూతనందిస్తోందని.. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న మెటీరియల్ ఉన్న డిజిటల్ ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. నలుగురు సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు డిజిటల్ ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మేలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుందని.. ఈ పరీక్షలో విజయం సాధించేందుకు అవసరమైన సమగ్ర మెటీరియల్ డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడం జరిగిందని.. అర్హులైన ఎస్సీ అభ్యర్థులకు వీటిని అందజేసినట్లు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో విజయానికి 360 డిగ్రీల కోణంలో అధ్యయనం అవసరమని.. ఇందుకు పీఎం అజయ్ కార్యాచరణ కింద అందిస్తున్న ఈ డిజిటల్ మెటీరియల్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సిలబస్పై పట్టు సాధించడంతో పాటు సమయపాలన, నిరంతర అభ్యాసం, విశ్లేషణాత్మక దృక్పథం ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని అభ్యర్థులను కలెక్టర్ లక్ష్మీశ ప్రోత్సహించారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈవో పీటీ సెల్వి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News