-కలెక్టరేట్లో అవగాహన
– శిక్షణా కార్యక్రమం నిర్వహణ
– కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ PGRS మీటింగ్ హాల్, బొమ్మూరు నందు సహజ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా కలిగే ఆరోగ్య, పోషణ ప్రయోజనాలపై అవగాహన – శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న APCNF రైతు సాధికార సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించారు. రసాయన వ్యవసాయానికి దూరంగా – ఆరోగ్యకర జీవనానికి సహజ వ్యవసాయం ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రసాయన వ్యవసాయం, పురుగు మందులు, యూరియా వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. సహజ వ్యవసాయం ద్వారా పండించిన ఆహారాన్ని వినియోగించడం వల్ల కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవచ్చని, భవిష్యత్ తరాలకు సురక్షితమైన జీవన విధానం అందించవచ్చని తెలిపారు. ఇంటి వద్ద స్థలం ఉన్న వారు హౌస్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలని, సహజ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయని అధికారుల ద్వారా వివరించారు. అంగన్వాడీ, పాఠశాలల ద్వారా సహజ ఉత్పత్తుల వినియోగం పెంపు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు అందిస్తే సమాజంలో ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందని జిల్లా స్థాయి అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రకృతి వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, PMFME మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు. మహిళా సంఘాల పాత్ర కీలకం – ప్రణాళికల సమీక్షకు ఆదేశాలు ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDA బి నాగేష్ మాట్లాడుతూ, మహిళా సంఘాలు కమిటీలుగా ఏర్పడి గ్రామ స్థాయిలో సేంద్రీయ వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని, ఉత్పత్తుల వినియోగంపై ప్రతి సంఘ సభ్యురాలికి అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు తమ తమ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించే విధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, వాటి అమలును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని కోరారు. కార్యక్రమం సందర్భంగా రైతుల స్టాళ్లు ఏర్పాటు చేసి సహజ వ్యవసాయ ఉత్పత్తులు, ఆకుకూరలు, కూరగాయలు మరియు అవసరమైన ఇన్పుట్స్ ప్రదర్శించారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ, సహజ వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గి, వినియోగదారుల ఆదరణ పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి నాగేష్ జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, APMIP ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. దుర్గేష్, జిల్లా ఉద్యానవన అధికారి ఎన్. మల్లికార్జున రావు, ఏపీ సి ఎన్ ఎఫ్ జిల్లా ప్రాజెక్టు అధికారి బి. తాతా రావు, DRDA ఏపిడి సత్యం నాయుడు , సహాయ జిల్లా ప్రాజెక్టు అధికారి ఎస్. మహబూబ్ వాలి, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కే . అరుణ కుమారి, సెక్రటరీ డి. లక్ష్మి పార్వతి , ట్రెజరర్ ఎస్కే ఫాతిమా , DRDA DPMలు, APMలు, AP CNF JPEలు, NFAలు, మండల సమాఖ్య అధ్యక్షులు, హెల్త్ సబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News