విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు ప్రజలతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం వి ఎం సి కాలనీ ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు.
అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే, డ్రై డే నిర్వహించాలని, వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటి లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు ,పాత టైర్లు ఖాళీ డబ్బాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బయోలజీస్ట్ కామేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, ఏ ఎన్ యం లు, ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News