-శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఏపీ పర్యాటక విధానం 2024-29’ ద్వారా భారీ రాయితీలు కల్పిస్తున్నాం
-గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలో డిస్నీ వరల్డ్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం
-ఇమాజికా, వండర్ లా వంటి ప్రముఖ సంస్థలతో పర్యాటక శాఖ చర్చలు జరిపిందన్న మంత్రి దుర్గేష్.. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాజెక్టులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించినట్లు వెల్లడి
-ఇటువంటి భారీ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయని తెలిపిన మంత్రి దుర్గేష్.. ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపు, అనుమతులు, రాయితీలు మాత్రమే కల్పిస్తుందని వివరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వినోద సౌకర్యాలు,థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని 171.14 ఎకరాల విస్తీర్ణంలో డిస్నీ వరల్డ్ తరహా ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ డిస్నీ వరల్డ్ లేదా యూనివర్సల్ స్టూడియోస్ వంటి భారీ ప్రాజెక్టులకు రూ. 35,000 కోట్ల నుండి రూ. 60,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని పేర్కొన్నారు.ఇటువంటి ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయని, ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపు, అనుమతులు, రాయితీలు మాత్రమే కల్పిస్తుందని వివరించారు. ప్రస్తుతం భారతదేశంలో పర్యాటకుల సగటు ఖర్చు చేసే సామర్థ్యం (రూ. 20,000-21,000) అంతర్జాతీయ ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వీటిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిస్నీ వరల్డ్ మరియు యూనివర్సల్ స్టూడియోస్ వంటివి యూఎస్ఏలోని ఓర్లాండో, లాస్ ఏంజిల్స్, జపాన్ లోని టోక్యో, ఫ్రాన్స్ లోని పారిస్,చైనాలోని షాంఘై వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో ఉన్నాయని ఈ సందర్భంగా వివరించారు.వీటి ఏర్పాటు డిమాండ్, సప్లైల మీద ఆధారపడి ఉంటుందన్నారు.ఆయా దేశాల్లో రిటర్న్ ఉన్నాయి కాబట్టి వాటి ఏర్పాటుకు ఆస్కారం ఉందన్నారు. మన దేశంలో ఏర్పాటు చేయాలంటే పర్యాటకుల రాక, వారి ఖర్చు చేసే సామర్థ్యం ఎక్కువగా ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించామని, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం రూ. 40 కోట్ల వరకు, 5–10 శాతం స్థిర మూలధన పెట్టుబడి సబ్సిడీ అందిస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. 100% స్టాంపు డ్యూటీ రీయింబర్స్మెంట్, 100 శాతం భూ వినియోగ మార్పిడి రుసుము మినహాయింపు, పారిశ్రామిక టారిఫ్ ప్రకారం విద్యుత్ ఖర్చు రీయింబర్స్మెంట్ 7–15 ఏళ్ల పాటు 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, 3 ఏళ్ల పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐలలో 50–100 శాతం రీయింబర్స్మెంట్, మెగా,అల్ట్రా-మెగా ప్రాజెక్టుల కోసం కేసు ప్రాతిపదికన ప్రత్యేక రాయితీలు ఇస్తుందన్నారు.
భారత దేశంలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లలో ఈ తరహా పార్కులు నిర్వహిస్తున్న ఇమాజికా, వండర్ లా వంటి సంస్థలతో పర్యాటక శాఖ చర్చలు జరుపుతోందని.. వారు తిరుపతి మరియు విశాఖపట్నంలో ప్రాజెక్టులపై ఆసక్తి చూపారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. డిస్నీ వరల్డ్ తరహా ఏర్పాటుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి హిక్సా, అరేబియన్ ట్రావెల్ మార్కెట్, ఐటీబీ బెర్లిన్, వరల్డ్ ట్రావెల్ మార్ట్ వంటి అంతర్జాతీయ రోడ్షోలతో పాటు ఢిల్లీలో జరిగిన సాటే( సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్), హైదరాబాద్ లో జరిగిన ట్రావెల్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్) వంటి జాతీయ, ప్రాంతీయ సదస్సులలో పాల్గొన్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన విశాఖ భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ రూ. 18,448 కోట్ల విలువైన 102 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిందని అందులో మూడు థీమ్ పార్కులకు సంబంధించినవని వివరించారు.
ప్రత్తిపాడుఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సూచించిన కర్నూతల గ్రామంలోని స్థలంలో వీటి ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపితే సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారని మంత్రి దుర్గేష్ పునరుద్ఘాటించారు. పర్యాటక శాఖ పనితీరుపై, మంత్రి కందుల దుర్గేష్ సమర్థతపై ఎమ్మెల్యే రామాంజనేయులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News