-పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీ
-జీవనశైలి విధానంలో వస్తున్న మార్పులతో పెరుగుతున్న అసంక్రమిత వ్యాధులు
-ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
-ఎన్ సిడి క్లినిక్ ల్లో పనిచేసేందుకు నియమించిన వైద్యులకు మంత్రి పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడచిన 20 నెలల్లో దాదాపు 9,000 నియామకాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని, ఇందులో 2000 మంది వైద్యులు,
5,800 మంది ఇతర పారా మెడికల్ ఉద్యోగులు, 1200 మంది ఆశా వర్కర్లు ఉన్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సగటున నెలకు 450 చొప్పున పోస్టులను భర్తీచేశామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.350 కోట్ల వరకు ఆర్ధిక భారం పడుతోందని పేర్కొన్నారు. రోగులకు ఉచిత వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించాలన్న లక్ష్యంలో భాగంగా జీరో వేకెన్సీ విధానం కింద ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత వైకాపా పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన ఆయుష్ వైద్యానికి పూర్వ వైభావాన్ని తీసుకువచ్చే క్రమంలో భాగంగా 75 వైద్యుల పోస్టుల భర్తీతోపాటు పారా మెడికల్, ఇతర కేటగిరిల్లో కలిపి 358 మంది పోస్టులను భర్తీచేస్తున్నామని పేర్కొన్నారు. పుడ్ సేఫ్టీ శాఖను కూడా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా 78 పుడ్ సేఫ్టీ ఆపీసర్ల పోస్టులతో కలిపి పారా మెడికల్ కేటగిరిలో కలిపి 261 పోస్టుల భర్తీకి చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా పొరుగుసేవల కింద గడచిన 20 నెలల్లో 223 పోస్టుల భర్తీ చేసినట్లు వివరించారు. పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని ‘ఆలోచన’ హాలులో నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (అసంక్రమిత) వ్యాధుల నిరోధ చర్యల్లో భాగంగా ప్రాంతీయ(సిహెచ్సిలు), ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్సిడి క్లినిక్ ల నిర్వహణ అవసరాల కోసం ఎంపికచేసిన 74 మంది వైద్యులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం నియామకపత్రాలు అందచేశారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ జీవనశైలిలో వచ్చిన మార్పులవల్ల అసంక్రమిత వ్యాధులు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా చేపట్టిన ఎన్ సి.డి.04 సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ కేసుల గుర్తింపు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ సర్వేలో భాగంగా అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని ప్రాంతీయ, ఏరియా ఆసుపత్రులకు పిహెచ్సి వైద్యులు పంపుతున్నారని, వీరికి వైద్య సేవలు అందించడంలో కొత్తగా ఎంపికైన వైద్యుల కీలక పాత్ర పోషించబోతున్నారని తెలిపారు. క్యాన్సర్ కేసుల్లో 60% వరకు ముందస్తు పరీక్షల ద్వారా నిరోధించగలిగేవని అన్నారు.
మీపై గురుతర బాధ్యత ఉంది:
కొత్తగా నియమితులైన వైద్యులపై గురుతర బాధ్యత ఉందని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు పేర్కొన్నారు. పీహెచ్సీలు, బోధనాసుపత్రుల మధ్య వారధిగా ఉండే ఆసుపత్రుల్లో పనిచేయనున్న వైద్యులు రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కొత్త వైద్యుల రాకతో ఇతర వైద్యులపై ఉన్న ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రుల్లోనే డెలవరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, కేంద్ర పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని, అభా ఐడీతో రోగుల వివరాల డిజిటలైజేసన్ చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమ వేదికను అలంకరించిన వారిలో వైద్య నియామక బోర్డు ఇంచార్జి కార్యదర్శి శేషారెడ్డి, జాయింటు డైరెక్టర్ (ఎన్సీడీ) శ్యామల, జాతీయ ఆరోగ్య మిషన్ సీఏఓ ప్రకాష్ రావు ఉన్నారు.
Prajavartha Online Telugu News