– స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు డైరెక్టర్ ఎం.శివప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల లక్ష్యసాధన, సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ, సేవల పంపిణీని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్బీఎంఎస్)ను అభివృద్ధి చేస్తోందని.. ఇందులో భాగంగా కచ్చితత్వంతో ఏకీకృత కుటుంబ సర్వే (UFS) నిర్వహించడం జరుగుతోందని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు డైరెక్టర్ ఎం.శివ ప్రసాద్ అన్నారు. ఆయన ఆదివారం విజయవాడలోని పటమట ప్రాంతంతో పాటు రూరల్ లోని గొల్లపూడి, అదేవిధంగా కొండపల్లి ప్రాంతంలో నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వే (యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే) ప్రక్రియను పరిశీలించారు. సర్వే సజావుగా సాగేందుకు, డేటాను కచ్చితంగా సేకరణకు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ మాట్లాడుతూ స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయ కుటుంబ డేటాబేస్లో నమోదైన కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటూ సర్వే నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) డేటా లేక్ను సంతృప్తికర స్థాయిలో నాణ్యంగా రూపొందించడం, వివిధ శాఖల ద్వారా ఆధార సహిత విధానాల రూపకల్పనకు దోహదం చేయడం లక్ష్యంగా సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News