– అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించండి
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడుతో కలిసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 131 అర్జీలు అందగా.. వీటిలో ఎంఏయూడీకి 37, రెవెన్యూ 28, పంచాయతీరాజ్19, పోలీస్ 16, హౌసింగ్ 4, వ్యవసాయం 3, విభిన్న ప్రతిభావంతులు 3, డీఆర్డీఏ 3, విద్య 3, ఏపీ సీపీడీసీఎల్ 2, పౌర సరఫరాలు 2, మైన్స్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, గ్రామీణ నీటిసరఫరా 2 అర్జీలు రాగా వైద్యఆరోగ్యం, మార్కెటింగ్, దేవదాయ, ఇరిగేషన్, రవాణా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాల్సిందేనన్నారు. నిబంధనలను పాటిస్తూ ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సమస్యకు సంబంధించిన శాఖ జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు.
హెచ్పీవీ వ్యాక్సిన్ పోస్టర్ల ఆవిష్కరణ:
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో జేసీ ఇలక్కియ.. డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, వివిధ శాఖల అధికారులతో కలిసి హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని కేన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా వేస్తున్నారు.
Prajavartha Online Telugu News