అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2026 సంవత్సరంలో ప్రపంచ వాతావరణ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఎల్ నినో (El Niño) పరిస్థితుల నేపథ్యంలో, రైతులు వ్యవసాయ పనుల్లో ముందుస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డా. ఆర్. శారదా జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ENSO పరిస్థితులు ‘న్యూట్రల్’ (తటస్థ) స్థితిలో ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ‘న్యూట్రల్ ఐఓడి’ (Neutral IOD) పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
రాబోయే వేసవి మరియు నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్ – ఆగస్టు 2026) కూడా వాతావరణం సాధారణ స్థితిలో ఉండే అవకాశం (సుమారు 56%) ఉన్నట్లు అంతర్జాతీయ అంచనాలు సూచిస్తున్నాయన్నారు.
అయితే 2026 ద్వితీయార్థంలో ఎల్ నినో పరిస్థితులు మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశం (సుమారు 60%) ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారన్నారు.
వాతావరణంలోని ఈ మార్పులు మన దేశ నైరుతి రుతుపవనాల సరళిపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల వర్షాధార వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, రైతులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారత వాతావరణ శాఖ (IMD) , వ్యవసాయ శాఖ జారీ చేసే సూచనలను రైతులు ఎప్పటికప్పటి తప్పనిసరిగా గమనించాలన్నారు.
స్థానిక వ్యవసాయ కేంద్రాల సలహాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలన్నారు.
వాతావరణ అనిశ్చితిని తట్టుకునేలా సాగులో శాస్త్రీయ పద్ధతులను, నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు.
వ్యవసాయ రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి, దిగుబడి నష్టాలను నివారించడానికి రైతులు అప్రమత్తంగా ఉండి, శాస్త్రవేత్తల సలహాలను అనుసరించాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డా. ఆర్. శారదా జయలక్ష్మి ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News