-రాష్ట్రంలోని కోళ్ల రైతులకు ముందస్తు హెచ్చరిక, సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తత…..
-పశుసంవర్ధక శాక సంచాలకులు డా.టి. దామోదర్ నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించినట్లు తెలియవచ్చిన నేపథ్యంలో మన రాష్ట్రంలోని కోళ్ల రైతులు, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లోని కోళ్ల రైతులు తగిన జీవభద్రతా ప్రమాణాలు పాటిస్తూ, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డా. టి. దామోదర్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని పశుసంవర్ధక అధికారులు,సిబ్బంది తమ పరిధిలోని కోళ్ల ఫామ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, కోళ్లు, వాటి ఉత్పత్తుల రవాణాను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. సరిహద్దు జిల్లాల్లోని రైతులు తమ ఫామ్లోని కోళ్ల ఆరోగ్య పరిస్థితిని నిత్యం పరిశీలించుకోవాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కోళ్ల పెంపకదారులు తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి కోళ్లు, గుడ్లు లేదా ఉత్పత్తులను అనుమతి లేకుండా తీసుకురాకూడదన్నారు. కోళ్ల ఫామ్లలో బయోసెక్యూరిటీ చర్యలను కచ్చితంగా పాటించాలన్నారు. ఫామ్లో అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ప్రవేశించకుండా చూడాలన్నారు. కోళ్లలో అకస్మాత్తుగా మరణాలు లేదా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప పశువైద్యధికారికి సమాచారం అందించాలన్నారు. చనిపోయిన కోళ్లను నిర్లక్ష్యంగా పారేయకుండా పశుసంవర్ధక శాఖ సూచనల ప్రకారం పూడ్చివేయాటం చేయాలన్నారు.
ఫామ్లలో శుభ్రత మరియు క్రిమిసంహారక చర్యలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని కోళ్ల పెంపకదారులు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని, పశుసంవర్ధక శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర్ నాయుడు ఆ ప్రకటనలో ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News