గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం సందర్శించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ పట్టణానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డున 1917 వ సంవత్సరం మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. అప్పటినుంచి 1930 సంవత్సరం వరకు గాంధీజీ ఇదే ఆశ్రమంలో నివసించారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన దండయాత్ర ను 1930 మార్చ్ 12 వ తేదీ ఇక్కడి నుంచే గాంధీజీ ప్రారంభించారు. సోమవారం ఆశ్రమాన్ని సందర్శించిన యార్లగడ్డ ఆశ్రమం మొత్తం కలియ తిరిగి ఆశ్రమ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలోని నేలకు నమస్కరించి గాంధీజీ వినియోగించిన వస్తువులను చూస్తూ ఆయన స్మృతులను గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక పవిత్ర స్థలాన్ని సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చిందని ఈ సందర్భంగా యార్లగడ్డ పేర్కొన్నారు. ఆ మహనీయుడు నడయాడిన పవిత్ర భూమిలో కొద్ది సమయం గడపటం ఉత్సాహాన్నిచ్చిందన్నారు. జాతిపిత గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత అంకితభావంతో పని చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్ పోటీని స్టేడియంలో ఉండి ప్రత్యక్షంగా తిలకించిన ఆయన భారత జట్టు తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శించి ఘన విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్టేడియంలోని దాదాపు 1.32 లక్షల మంది క్రికెట్ అభిమానుల కేరింతల మధ్య ఉండి మ్యాచ్ తిలకించడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటనగా పేర్కొన్నారు. ఇంతటి భారీ జనసమూహం మధ్య తాను ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడలేదని, ఇంత జన సమూహం ఉన్న బహిరంగ సభలలోనూ తాను ఇప్పటి వరకు పాల్గొనలేదని తెలిపారు. భారత జట్టు విజయాన్ని దగ్గరుండి చూడటం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. స్టేడియంలో ఉన్న జన సమూహం కన్నా ఎక్కువమంది (1.35లక్షలు ) గన్నవరం నియోజకవర్గం లో తనకు ఓట్లు వేసి శాసనసభకు పంపించారని వారందరి సమస్యలు తీర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ముందంజలో నిలపాలన్న ఆకాంక్ష కలిగిందన్నారు.
Prajavartha Online Telugu News