-మే 1తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ
-వచ్చే నెల 15 నుంచి పాటు స్వీయగణన కార్యక్రమం
-రెండు దశలుగా 2027 జనగణన కార్యక్రమం గురించి సీఎంకు వివరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2027 జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1 తేదీ నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె. నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జనాభా లెక్కల ప్రక్రియను రెండు దశలుగా చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన (హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్) ప్రక్రియను చేపట్టనున్నట్టు జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. మే 30 తేదీ వరకూ జరిగే ఈ ప్రక్రియలో ఇళ్లలోని పరిస్థితులు, గృహాల్లోని వివిధ సదుపాయాలను, ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16 తేదీ నుంచి 30 తేదీ వరకూ స్వీయ గణన వెసులుబాటు కల్పించినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. జనగణనలో భాగంగా సామాజిక ఆర్ధిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్టు తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సెస్ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. మొబైల్ అప్లికేషన్లు, ప్రత్యేకించిన వెబ్ పోర్టళ్ల ద్వారా ఈ సమాచార సేకరణ జరుగుతుందన్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ లోనూ సమాచార సేకరణ, జనగణన చేపట్టనున్నట్టు తెలియచేశారు. ప్రజలే నేరుగా తమ వివరాలను స్వీయ గణన ద్వారా నమోదు చేసేందుకు పబ్లిక్ పోర్టల్ ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. దీని కోసం సెన్సెస్ మేనేజ్మెంట్ మోనిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నిరంతరం ఈ జనగణన ప్రక్రియను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ కోసం డిజిటల్ సరిహద్దు మ్యాపింగ్ చేయనున్నట్టు వివరించారు. వివరాల నమోదు కోసం 16 భాషల్లో హౌస్ లిస్టింగ్ మొబైల్ యాప్ అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ముఖ్యమంత్రికి తెలియచేశారు. 2027 జనగణన ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రగతి, వికాస్ అనే మస్కట్ లను వినియోగిస్తున్నట్టు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు.
Prajavartha Online Telugu News