-జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక
-మెసాలకు, అబద్ధాలకు మారుపేరు నువ్వు
-నీకు విజన్ లేదు.. రాష్ట్రం గురించి ఆలోచన లేదు..
-ఉనికి కోసం వారాంతపు రాజకీయాలు
-నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచితే..
-ట్రూడౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గించాం
-ఉద్యోగులను మోసగించావ్… కేసులతో వేధించావ్
-ఆస్తుల కోసం చెల్లిని, తల్లిని గెంటేసిన చరిత్ర నీతి
-నీ అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ ధ్వంసం
-జగన్ పై మంత్రి సవిత విసుర్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అని, ఆయనకు విజన్ లేదు… రాష్ట్రం గురించి ఆలోచన లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసి పిలిచినా, జగన్ పారిపోయాడని, నాలుగు గోడల మధ్య కూర్చొని చంద్రబాబుపైనా, కూటమి ప్రభుత్వంపైనా బురద జల్లడం మానుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తన రాజకీయ ఉనికి కోసం, జగన్ వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వారాంతపు రాజకీయాలు చేస్తూ, కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. ఆయన అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన ప్రబుద్ధుడని మండిపడ్డారు. జగన్ హయాంలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. హామీలిచ్చి మడమ తిప్పేసిన చర్రిత ఆయనదన్నారు. మెగా డీఎస్సీ, సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇలా ఎన్నో హామీలిచ్చి ముఖం తిప్పేశారన్నారు. ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పి జగన్ దంపతులు మోసం చేశారన్నారు. బీసీ బిడ్డలకు రూ.110 కోట్ల డైట్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే ఆ బకాయిలన్నింటినీ చెల్లించిందని గుర్తుచేశారు. కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలను జగన్ పెంచితే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ, ట్రూడౌన్ పేరుతో ఛార్జీలు తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. జగన్ తండ్రి కంప్యూటర్లు కూడు పెడతాయా..? అని ఆనాడు విమర్శిస్తే… ఈనాడు పిల్లలు కనడమెందుకు…? అని ఆయన అంటున్నారన్నారు. చంద్రబాబు విజన్ వల్లే నేడు ఐటీలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నారు. జనాభా భారం కాదు…భాగ్యం… అని తమ నాయకుడు సీఎం చంద్రబాబు నమ్మిన సిద్ధాంతమన్నారు. జనాభే ఆస్తి అని నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారన్నారు. జగన్ విజన్ లేదు, రాష్ట్రం గురించి ఆలోచనే లేదన్నారు. 5 ఏళ్లలో దోచుకోవడమే పనిగా జగన్ పాలన సాగిందని, ఆనాడు ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయని అన్నారు. ఇప్పటికైనా నాలుగు గోడల మధ్య కూర్చొని చంద్రబాబుపైనా, కూటమి ప్రభుత్వంపైనా బురద జల్లడం మానుకోవాలని మంత్రి సవిత హితవు పలికారు.
Prajavartha Online Telugu News