‘గ్రామ ఉజాలా’ పథకానికి కేంద్రం శ్రీకారం

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వినియోగదారులకు కేవలం రూ.10కి ఎల్‌ఈడీ బల్బును అందించే పథకానికి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని తొలిదశలో అమలు చేసేందుకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మహారాష్ట్రలోని నాగపూర్‌, బిహార్‌లోని ఆరా, పశ్చిమగుజరాత్‌ ప్రాంతాలను ఎంచుకున్నారు. గ్రామీణులకు 7 వాట్లు, 12 వాట్లు గల మొత్తం 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేస్తారు. గ్రామీణ వినియోగదారులు తమ దగ్గర ఉన్న పనిచేసే బల్బును అందించి దానికి బదులుగా వీటిని పొందవచ్చు. ఐదు బల్బుల వరకూ మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ బల్బులకు మూడేళ్ల వరకూ వారంటీ ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) అనుబంధ సంస్థ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) ఆయా పథకం నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. ఈ బల్బులను వినియోగించటం వల్ల ఏడాదికి 2025 కిలోవాట్‌అవర్‌ విద్యుత్తును, 1.65 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ‘‘గ్రామ ఉజాలా పథకం గ్రామీణ గృహాల్లో విద్యుత్‌ వెలుగులను ప్రసరింపజేయనుంది. జీవన ప్రమాణాన్ని మెరుగుపరచటానికి ఉపకరిస్తుంది’’ అని ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి ఆర్‌.కె.సింగ్‌ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

ముప్పాళ్ల/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *