-చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యేక అతిథులుగా వీక్షించనున్న 250 మంది ‘రైతు ఉత్పత్తిదార్ల సంఘం’ పథకం లబ్ధిదార్లు; వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
-ఎర్రకోటలో జరిగే వేడుకలకు దేశం నలుమూలల నుంచి హాజరుకానున్న వివిధ రంగాలకు చెందిన 1800 మంది ప్రత్యేక ఆహ్వానితులు; జీవిత భాగస్వాములతో కలిసి న్యూదిల్లీ రావాలని, ఎర్రకోట పైనుంచి జాతిని ఉద్దేశించి చేసే ప్రధాన మంత్రి ప్రసంగాన్ని వినాలని ఎఫ్పీవో పథకం లబ్ధిదార్లకు ఆహ్వానం
న్యూదిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15న, దేశంలోని నలుమూలకు చెందిన 1800 మంది ప్రత్యేక వ్యక్తుల సమక్షంలో, చారిత్రాత్మక ఎర్రకోటలో ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఆ తర్వాత జాతిని ఉద్దేశించి ఆయన చేసే ప్రసంగాన్ని వినడానికి వివిధ రంగాలకు చెందిన 1800 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా భారత ప్రభుత్వం ఆహ్వానించింది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ‘రైతు ఉత్పత్తిదార్ల సంఘం’ పథకం కింద సుమారు 250 మంది లబ్ధిదార్లను దేశం నలుమూలల నుంచి ఆహ్వానించింది. జీవిత భాగస్వాములతో కలిసి న్యూదిల్లీ రావాలని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం పంపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు ప్రత్యేక వ్యక్తులకు కూడా ఈ ఆహ్వానం అందింది.
ఎఫ్పీవోలు, పంట పెట్టుబడుల నుంచి ఉత్పత్తి వరకు సభ్య రైతులకు దన్నుగా నిలుస్తాయి. సభ్య రైతుల ఆదాయం, బేరసారాల శక్తిని మెరుగుపరచడానికి పని చేస్తాయి.
ఆహ్వానం అందుకున్న ఐదుగురు ప్రత్యేక వ్యక్తుల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్సార్టియం’కు చెందిన రాజేష్ చింతపర్తి ఒకరు. ప్రత్యేక ఆహ్వానితుడిగా దేశ రాజధానికి వెళ్లి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News