విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీల నోడల్ అధికారుల నియామకం, జిల్లా కంట్రోల్ రూమ్, ఫిర్యాదుల నివేదిక తదితర అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక రూపొందించుకొని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రటకించిన నాటి నుండి నేటి వరకు నమోదైన అన్ని దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఉన్న 1,781 పోలింగ్ కేంద్రాలతో పాటు విజయవాడ రూరల్ మండలంలోని భాగమైన గన్నవరం నియోజకవర్గంలోని 82 పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తంగా ఉన్న 1,863 పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్, టాయిలెట్, త్రాగునీరు, తదితర మౌళిక వసతులను పరిశీలించి సిద్ధం చేస్తున్నామన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ నాటి నుండి వివిధ వార్తా పత్రికలలో వచ్చిన ప్రతికూల వార్తల పరిష్కార నివేదికలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశామన్నారు. బీఎల్వోలకు శిక్షణ పూర్తి చేశామన్నారు. ఎన్నికల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ లో భాగంగా కంప్యూటర్లు, టీవీలు, స్కానర్లు, ప్రింటర్లు తదితర అన్ని సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.
Prajavartha Online Telugu News