విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) శనివారం జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని విజయవాడ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈసీఐ ప్రకటించిన సాధారణ ఎన్నికల-2024 షెడ్యూల్కు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఒక పార్లమెంట్, 7 శాసన సభా నియోజక వర్గాలకు ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుగుతాయని, అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్ 29 ఆఖరు తేదీ అని తెలిపారు. తదుపరి మే 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతాయని, మొత్తం ఎన్నికల ప్రక్రియ జూన్ 6వ తేదీతో ముగుస్తుందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News