దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లిలో కాపు సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తానేటి వనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనిలో భాగంగా దేవరపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో శుక్రవారం రాత్రి కాపు సంఘ కమిటీ భవనానికి భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కెవికె దుర్గారావు, కాపు సంఘం ఆధ్వర్యంలో హోంమంత్రి తానేటి వనితను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కాపులకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కాపుల కోసం ప్రత్యేకించి కాపు నేస్తం వంటి ఎన్నో నూతన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాపుల సంక్షేమానికి ఈ ఐదేళ్లలో 33 వేల 623 కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. రానున్న రోజుల్లో కాపులకి మరిన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కాపు సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వంలో నిజమైన మేలు జరిగిందా ఆలోచన చేయాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News