విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు జీతభత్యాలు 010 హెడ్ కింద చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సక్రమంగా అమలు జరగాలంటే ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోనికి తేవాలని మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్ పి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
విజయవాడ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన వర్కుషాపులో విద్యాశాఖ జారీ చేసిన సర్వీసు ప్రతిపాదనలపై ఒక వర్కు షాపు నిర్వహించి ప్రతిపాదనలో చేపట్టవలసిన మార్పుల గురించి చర్చించినట్లు ఏపీఎంఎస్ టిఎఫ్ కో-కన్వీనర్ ఎస్. బాలాజీ తెలియజేశారు. మోడల్ స్కూల్స్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటును నిలిపివేసిన కారణంగా ఉపాధ్యాయులు జీతభత్యాలు 010 హెడ్ ద్వారా చెల్లించేందుకు వారి సర్వీసులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోనికి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ సొసైటీ పరిధి నుంచి తప్పించి పాఠశాల విద్యాశాఖ పరిధిలోనికి తేవాలని ఏపీ.ఎం.ఎస్.టి.ఎఫ్. ఆధ్వర్యంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలౌ సభ్యులు అభిప్రాయపడ్డారు.
మోడల్ స్కూల్ రెగ్యులర్ సిబ్బందికి రావలసిన అన్ని సర్వీస్ ప్రయోజనాలపై చర్చ జరిగింది . వీటిపై జిల్లాల్లోని టీచర్స్ అభిప్రాయాలను కూడా పరిగణనలో తీసుకొని సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాల్ని క్రోడీకరించి అధికారులకు సమర్పించడం జరుగుతుందని కన్వీనర్ చంద్రశేఖర్ మరియు కో కన్వీనర్ బాలాజీ తెలిపారు. అంతేకాకుండా 010 పద్దు జీతాల్లో ఉన్న సాంకేతిక అంశాలను కూడా పరిష్కరించేందుకు ప్రాతినిధ్యం జరపడం అయిందని తెలిపారు.
ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ పాల్గొని మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బంది సమస్యలపై యుటిఎఫ్ సహకారం ఉంటుందని తెలియజేస్తూ సంఘ బలోపేతం కోసం ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ప్రధాన బాధ్యులు పాల్గొన్నారు.