హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు చేపట్టింది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్బండ్పై నిర్వహించిన కార్నివాల్, లేజర్ షో, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పదేళ్ల పండుగ.. రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్రెడ్డి ముందుగా గన్పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించి, పరేడ్ గ్రౌండ్కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రేవంత్రెడ్డి విడుదల చేశారు. పదేళ్లలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్న సీఎం.. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన.. మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ ఆమె ప్రత్యేక వీడియో సందేశం పంపారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను పూర్తిచేయడానికి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తుందన్నారు. సాయంత్రం ట్యాంక్బండ్పై తెలంగాణ ఆవిర్బావ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సాంస్కృతిక, సాహిత్య, కళాకారులతో అద్భుతమైన ప్రదర్శనలు చేపట్టారు. కూచిపూడి, భరతనాట్యంతో పాటు వివిధ కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలు శాఖల మంత్రులు, పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, ఫుడ్స్టాళ్లు కనువిందు చేస్తున్నాయి. 700 మంది కళాకారులతో అద్భుత ప్రదర్శన, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చివరలో నిర్వహించిన లేజర్ షో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలువనుంది. అనంతరం ట్యాంక్బండ్పై 5వేల మంది జాతీయ పథకంతో భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. ఆవిర్భావ సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.
Tags hyderabad
Check Also
గుంటూరులో అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …