అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు, పెద్దవారు అని వయసుతో సంబంధం లేకుండా ఊబకాయ సమస్య చాలామందిని వేధిస్తుంది. ఈ సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్యకర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం. సరైన వ్యాయామాలు లేకపోవడం. మన పూర్వీకులలో చాలా మందికి పొట్ట(ఊబకాయం) సమస్య ఉండదు. అసలు వారు వాడే ఆహార పదార్థాలే వేరు.
మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన సజ్జలు కీలక పాత్ర వహిస్తాయి. వాటిలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం..
1. 100 గ్రాముల సజ్జలలో 3 మి.ల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం చాలా మంచిది.
2. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి. అంతేకాకుండా కండరాలకు ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
3. షుగర్ వ్యాధితో బాదపడేవారికి సజ్జలు చక్కని ఆహారం. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన షుగర్ లెవల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది.
4. ఈ స్థూలకాయ సమస్య ఉన్నవారు ప్రతిరోజు మొలకెత్తిన సజ్జలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎదిగే పిల్లలకు సజ్జలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి సజ్జలు దోహదపడతాయి. అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
5. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలకు మొలకెత్తిన సజ్జలను పెట్టడం ద్వారా ఎత్తు పెరుగుతారు. అంతేకాకుండా ఇవి శరీరాన్ని చలువపరుస్తాయి.
6. సజ్జ పిండిలో బెల్లం కలిపి రొట్టెలా చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించి రక్తంలోని కొలస్ట్రాల్ని తగ్గిస్తాయి.
7. సజ్జలలో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలలో, పిల్లల్లో రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాకుండా ఎసిడిటీ, కడుపులో మంట అజీర్ణం, ఇతర ఉదరకోశ సమస్యలకు సజ్జలు దివ్యౌషధం.
8. సజ్జలలో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది మన శరీరంలోని కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన శరీరంలోని శక్తిని పెంచి ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. మనలోని ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
Prajavartha Online Telugu News