Breaking News

తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కదిలిన యంత్రాంగం
-భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక దృష్టి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు… చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవ లేదంటారు పెద్దలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్  ఎంత గొంతు చించుకున్నా ప్రభుత్వంలో చలనం రాలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్, సమీక్ష చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ తల్లి తమ కుమార్తె మిస్సయ్యిందంటూ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ కి మొరపెట్టుకున్న తరవాత… ఆయన సూచనలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలిపి ఆ యువతి ఆచూకిని జమ్మూలో పోలీసులు కనిపెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం జమ్ము వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతం అయ్యింది.

భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని పవన్ కళ్యాణ్ కి చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ, మీరే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట గుండెలవిసేలా విలపించారు. ఆ తల్లి రోదనలు విని చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాచవరం సీఐతోనూ, విజయవాడ పోలీస్ కమిషనర్ తోనూ ఫోనులో మాట్లాడారు. కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. పోలీసులు అంతే వేగంగా కదిలారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకి కనుగొన్నారు. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన గాలింపు ఫలించి జమ్మూలో ఆ బాలిక ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బాలికను తీసుకువస్తున్న విషయాన్ని విజయవాడ కమిషనర్ శ్రీ పీహెచ్డీ రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షలో ఉండగా తెలిపారు. సమీక్ష మధ్యలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి ఆచూకీ కనుగొన్న పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేశారు. ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ద చేయవద్దని ఈ సందర్భంగా కోరారు. పోలీసు వ్యవస్థతో పని చేయించుకుంటే ఆ శాఖలో అద్భుత అధికారులు ఉన్నారని పోలీస్ శాఖ పని తీరుని కొనియాడారు.

లవ్ ట్రాప్ వేసి వేధిస్తే ఫిర్యాదు చేయండి
పవన్ కళ్యాణ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ యువతి అదృశ్యం కేసు ఛేదించిన పోలీసులను అభినందించారు. తమ బిడ్డ కనిపించకపోతే 24 గంటల్లోపు ఫిర్యాదు చేసి విచారణ వేగంగా మొదలుపెడితే ప్రయోజనం ఉంటుందన్నారు. యువతులను లవ్ ట్రాప్ చేసి ఈ విధమైన నేరాలు చేస్తున్నారని… అలా చేసేవారి పట్ల ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *