Breaking News

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల

-వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు మరో రూ. 290 కోట్లు
-టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలి
-ఆర్.ఓ.బీలపూర్తికి భూసేకరణ కోసం నిధుల విడుదల
-రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలి
-రోడ్లు & భవనాల శాఖ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అదే విధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగా ఉన్న పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు సిఎం తెలిపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సిఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా ఆర్వోబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన రూ.42 కోట్ల నిధుల విడుదలకు కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని సిఎం ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు ఎంత పని పూర్తి చేయగలం అనేది మదింపు చేసుకుని టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చెయ్యాలని సిఎం ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై రివ్యూ చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలోమంత్రి బిసి జనార్థన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్ నెట్ వర్క్ కు తీవ్ర నష్టం జరిగిందని సిఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారు అయ్యిందని సిఎం అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 4,565 కి.మీ రోడ్లలో మరమ్మతు పనులు చేసేందుకు రూ.186 కోట్లు, వివిధ జిల్లాల్లో గుంతలు పూడ్చడం కోసం రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్, లైడార్ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనుల చేయాలని ఆదేశించారు. సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న ROB ల భూ సేకరణ కోసం పెండింగ్ లో ఉన్న రూ.42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు వెంటనే పూర్తి చెయ్యాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సేతుబంధన్, గతి శక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్ని ROB లను త్వరగా చేపట్టి పూర్తి చెయ్యాలని అన్నారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పని చేయడం లేదని, పనితీరు మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనుకాడవద్దని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బై పాస్, విజయవాడ -హైదరాబాద్, హైదరాబాద్ -బెంగుళూరు హైవేల విస్తరణ, హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని సిఎం అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *