Breaking News

దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం…

-మెరుగైన ఆవిష్కరణతో అమ్మవారి దర్శనం ఏర్పాట్లు..
-సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనమే లక్ష్యం..
-అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల విజయవంతానికి కృషి..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన
-పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌ వి రాజశేఖర్‌ బాబు
-ఎంఎల్‌ఎ వై. సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లు కు తావు లేకుండా అధికారులు సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు.

స్థానిక శాసనసభ్యులు వై. సుజనా చౌదరి మాట్లాడుతూ గతం కంటే మరింత మెరుగ్గా దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు భక్తుల సలహాలు సూచనలు పొందేందుకు ప్రత్యేక వైబ్‌ సైట్‌ను రూపొందించాలని తెలిపారు. వృద్ధులు, విభిన్నప్రతిభావంతులు విఐపిలు, వివి ఐపిలకు ప్రత్యేక టైమ్‌ స్లాట్‌లను కేటాయించి వారికి ముందుగానే తెలియపరిచి ఆయా సమయాలలోనే అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని ఆయన సూచించారు. భక్తులకు హోల్డింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేసి నిరీక్షణ లేకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

అక్టోబర్‌ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన, పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌ బాబు, శాసనసభ్యులు వై. సుజనా చౌదరి లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగి పడకుండా ఇప్పటికే దేవస్థానం పటిష్ట చర్యలు తీసుకుందని అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా అధికారులు ఉండాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దసరా ఉత్సవాలలో ప్రతి రోజు లక్ష మందికి పైగా మూలా నక్షత్రం రోజు రెండు నుండి మూడు లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూలైన్‌లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జి. సృజన తెలిపారు.

పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాధి మంది అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుండి 3,500 మంది సిబ్బంది సేవలను దసరా ఉత్సవాలలో వినియోగించనున్నామన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు ప్రతి నిర్ణీత ప్రాంతం, సెక్టార్‌ (రంగం)కి ఒక ప్రత్యేక అధికారి పరిశీలనలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. దుర్గా ఘాట్‌ సమీపంలో గల కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా దసరా ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆలయ ఈవో కె.ఎస్‌. రామరావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో అమ్మవారు పది అవతారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారన్నారు. అక్టోబర్‌ 3వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, 4న శ్రీ గాయత్రీ దేవి, 5న అన్నపూర్ణ దేవి, 6న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 7న శ్రీ మహాచండీ దేవి, 8న శ్రీ మహలక్ష్మి దేవి, 9న శ్రీ సరస్వతి దేవి, (మూలా నక్షత్రం) 10న శ్రీ దుర్గాదేవి, 11న శ్రీ మహిషాశురమర్థినీ దేవి, 12న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారంతో దర్శనం ఇస్తారన్నారు. అక్టోబర్‌ 9వ తేదీన అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు. ఆన్లైన్‌ టికెట్‌ లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రిసెప్షన్‌, టోల్‌గేట్‌, హోమ్‌ టర్నింగ్‌, పున్నమి ఘాట్‌, వియంసి ఆఫీస్‌, కలెక్టర్‌ ఆఫీస్‌, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌, మోడల్‌ గెస్ట్‌ హౌస్‌, హెడ్‌ వాటర్‌ వర్క్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ల వద్ద్ద కరెంటు టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వినాయకుడి గుడి నుండి టోల్‌గేట్‌ ద్వారా కొండపైన హోం టర్నింగ్‌ వరకు మూడు క్యూ లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓం టర్నింగ్‌ వద్ద ఉచిత దర్శనం, వి ఐ పి క్యూ లైన్లతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లు ఉంటాయన్నారు. భక్తులకు త్రాగునీరు అందించేందుకు ఈ ఏడాది వాటర్‌ ప్యాకెట్లతో పాటు వాటర్‌ బాటిల్సు సరఫరా చేయనున్నామన్నారు. కనకదుర్గానగర వద్ద ప్రత్యేక ప్రసాదం కౌంటర్లుతో పాటు కొండపైన ఓం టర్నింగ్‌ వద్ద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని 25 లక్షల లడ్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రధం సెంటర్‌, మున్సిపల్‌ఆఫీసు, సీతమ్మ వారి పాదాలు, కుమ్మరి పాలెం, పున్నమి ఘాట్‌ వద్ద ఉచిత చెప్పుల స్టాండ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు స్నానమాచరించేందుకు సీతమ్మ వారి పాదాల వద్ద 500 షవర్స్‌, పున్నమి ఘాటు వద్ద 100, భవాని ఘాట్‌ వద్ద 100 షవర్స్‌లతో పాటు 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు అమ్మవారి ఉచిత ప్రసాదం కింద పులిహోర, కట్టు పొంగలి, దద్దోజనం, సాంబారు అన్నం మహామండపం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, సూచనలు సలహాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఆలయ ఈవో అన్నారు.

సమావేశంలో డిసిపిలు గౌతమి శాలి, యం. కృష్ణమూర్తి నాయుడు, అడిషనల్‌ డిసిపిలు జి. రామకృష్ణ, యం. రాజరావు, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఆర్‌డివో భవాని శంకర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్మయి, దేవస్థానం ఈఈలు ఎల్‌. రమ, కోటేశ్వరరావు, వివిధ విభాగాల సూపరింటెండెంట్‌లు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *