తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్ పెండింగ్ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఆదిశగా అధికారులు ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తిరుపతి, తిరుమల ప్రజలకు త్రాగునీరు, సాగునీరు సమస్య లేకుండా పనులు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలోని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి నీటి నిల్వలను సంవృద్ధిగా ఉండేలా చూసి ఆయకట్టు ద్వారా సాగు, త్రాగు నీరు అందేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగా ప్రాజెక్టు, జి.ఎన్.ఎస్.ఎస్ ఎస్. ఈ మదన గోపాల్, తెలుగు గంగ ప్రాజెక్టు ఈ.ఈ (వెంకటగిరి) రాదా కృష్ణ మూర్తి , తిరుపతి మైనర్ ఇరిగేషన్ ఈ ఈ వెంకటేశ్వర్ ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News