-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత ఏడాది రూ.4.24 లక్షల కోట్లు ఉండగా… ఈ ఏడాది 20 శాతం పెంచి రూ.5,11,491 కోట్లతో ప్రాధమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది. సాగుకు మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో పంట రుణాలు రూ.1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.8,265 కోట్లు, ఫిషరీస్కు రూ.21,098 కోట్లు, హార్టికల్చర్కు రూ.11,961 కోట్లు కేటాయించింది. హార్టికల్చర్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు రూ.5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.9,957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు రూ.12,687 కోట్లతో ప్రణాళిక సిద్దం చేసింది. అలాగే ఎంఎస్ఎంఈ లకు రూ.1.64 లక్షల కోట్లు చొప్పున కేటాయించింది.
హార్టికల్చర్కు అండగా నిలవండి..
నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హార్టికల్చర్ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డ్ ప్రతినిధులను సీఎం కోరారు. ఈ సందర్భంగా హార్టికల్చర్లో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఏడాదికి 450 లక్షల మెట్రికల్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తులు రాష్ట్రం సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం అందులోనూ… హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం అన్నారు. దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని బ్యాంకులు, నాబార్డ్ అందించాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సీజీఎం ఎం.ఆర్. గోపాల్, జీఎం కెవిఎస్ ప్రసాద్, కెనారా, ఎస్బీఐ, ఎస్ఎల్బిసి, ఏపీజీబీ, ఏపీసీవోబీ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News