-పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
-సానుకూలంగా స్పందించి, నిధుల విడుదలకు కృషి చేస్తామన్న మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్కాపురం జిల్లా కంభం మండలంలో అత్యంత ప్రాచీనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు వెలగపూడి సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కంభం చెరువు విశిష్టతను వివరిస్తూ.. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన అతిపెద్ద మరియు పురాతనమైన చెరువుల్లో కంభం చెరువు ఒకటని పేర్కొన్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటక వసతుల కొరత ఉందని ఎమ్మెల్యే మంత్రి దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కంభం చెరువు పరిసర ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కొరత ఉందని, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చెరువు పరిసరాలను పటిష్టం చేయాలని, ఆధునీకరించాలని కోరారు.ఈ నేపథ్యంలో కంభం చెరువు సమగ్ర అభివృద్ధికి, ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకు రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు.తద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు స్థానికంగా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, పర్యాటక రంగ విస్తరణకు దోహదపడుతుందన్నారు.ఎమ్మెల్యే అభ్యర్థనపై మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక ప్రణాళికలతో ఉన్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ క్రమంలో కంభం చెరువు అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.చారిత్రక కంభం చెరువును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
Prajavartha Online Telugu News