-హోంమంత్రి వంగలపూడి అనిత
-బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం: హోంమంత్రి
-విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామ శివారులోని బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు మృతి చెందడం విషాదకరమన్నారు. మృతి చెందిన కుటుంబాలకు హోం మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తీవ్రగాయాలపాలై తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఐదుగురు మహిళలకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని హోంమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రాంతాలకు ముందుగా సందేశం, ఫోన్ కాల్స్ చేసి అప్రమత్తం చేసే విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.
Prajavartha Online Telugu News