-ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే భారత రాజ్యాంగమే కారణం
-దేశాభివృద్ధికి జస్టిస్ వంటి వారి గైడెన్స్ అవసరం.
-75 ఏళ్ల రాజ్యాంగం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-ఏపీ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహణ… హాజరైన సీజేఐ గవాయ్, ఏపీ సీజే ఠాకూర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేషన్ ఫస్ట్ అనే విధంగానే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండే సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కన్పిస్తోందని… ఈ రకమైన సమానత్వాన్ని సాధించడానికి పబ్లిక్ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం సీకే కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయవాదుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీజేఐ జస్టిస్ గవాయ్, ఏపీ సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…ఛాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారంటే అందుకు భారత రాజ్యాంగమే కారణమని అన్నారు. ఇలాంటి సందర్భంలో అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయవ్యవస్థే
సమాజంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయ వ్యవస్థేనని ముఖ్యమంత్రి అన్నారు. ‘సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ ఎడిటర్లు అయిపోతున్నారు… వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.. వన్ పర్సన్ – వన్ ఓట్.. అనేది అంబేద్కర్ ఇచ్చిన వరం. కొన్ని దేశాల్లోని ఓటర్లకు సమాన హక్కులు ఉండవని… ఓటు హక్కు విషయంలో పేద-ధనిక, లింగ బేధాలు లేని దేశంగా భారత్ దేశం ఉందని చెప్పారు. ఓటు విషయంలో ఇంకా పేద-ధనిక తారతమ్యాలు ఉన్నాయని… ఈ అంతరాలను తగ్గించేలా అందరూ ఆలోచన చేయాలని సీఎం సూచించారు. అందరికీ సమాన అవకాశాలు కలిగేలా చేయగలిగితే… ఈ తారతమ్యాలు మాయం అవుతాయని అభిప్రాయపడ్డారు. అందుకే నేను హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని.. దీనికి అందరి నుంచి సహకారాన్ని కోరుతున్నానని సీఎం చెప్పారు. ప్రధాని మోదీ కూడా వసుధైక కుటుంబం గురించే మాట్లాడతారని… ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కర్నీ మన కుటుంబ సభ్యులుగానే భావించాలని.. వసుధైక కుటుంబం భావన ఉండాలని వివరించారు. అలాగే ఒకరి సార్వభౌధికారంలో వేరే వారు జోక్యం చేసుకోకుండా పరిధులు దాటకుండా ఉండాలని… ఈ విధానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు.
గవాయ్ లాంటి వ్యక్తులు గైడ్ చేస్తూనే ఉండాలి
‘జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐ స్థాయిలో ఉన్నా… చాలా సింపుల్ గా ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. సమానవత్వానికి సీజేఐ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని… చాలా మంచి మనస్సున్న వ్యక్తి జస్టిస్ గవాయ్ అనే చెప్పారు. తన విధి నిర్వహణలో గవాయ్ మంచి తీర్పులు ఇచ్చారని… ప్రజలంతా ఆ తీర్పులు గుర్తు పెట్టుకునేలా ఉంటాయని చంద్రబాబు అన్నారు. గవాయ్ లాంటి వారు దేశాభివృద్ధి కోసం నిరంతరం గైడ్ చేస్తూనే ఉండాలని కోరారు. అమరావతిలో ఈ సదస్సు జరుగుతోంది… సీజేఐ బీఆర్ గవాయ్ కూడా మహారాష్ట్రలోని అమరావతి నుంచే వచ్చారని సీఎం వివరించారు. తాను నేను సీఎంగా, సీజేఐగా గవాయ్, ఏపీ సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ ఉన్నామని… మేం మా విధులను రాజ్యాంగబద్దంగా నిర్వహిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.
దేశంలో పెద్దఎత్తున మానవ వనరులు
ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రజల ఆలోచనా విధానం మారిందని.. పరిస్థితులు కూడా మారుతున్నాయని సీఎం చెప్పారు. చాలా దేశాలు యువత లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. కానీ భారత దేశానికి అలాంటి సమస్య లేదు. మన దేశంలో పెద్ద ఎత్తున మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని.. భారత దేశాన్ని ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలిపేలా ప్రధాని పని చేస్తున్నారని చెప్పారు. 2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రభావం చూపే స్ధాయికి చేరుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేయాలనే విధాన నిర్ణయం తీసుకున్నామని… హైదరాబాద్ అభివృద్ధే దానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Prajavartha Online Telugu News