రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శీతాకాలంలో పొగమంచు కారణంగా విమానాల ఆలస్యం లేదా అంతరాయాలు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో, రాజమండ్రి విమానాశ్రయంలో భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) ఆధ్వర్యంలో శనివారం మాక్ డ్రై రన్ నిర్వహించడం జరిగిందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎన్.కె. శ్రీకాంత్ తెలియ చేశారు. శనివారం నిర్వహించిన డ్రై రన్లో రాజమండ్రి విమానాశ్రయంలోని ATC, CNS, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, ARFF విభాగాలతో పాటు భారత వాతావరణ శాఖ, ఇండిగో ఎయిర్లైన్స్, అలయన్స్ ఎయిర్లైన్స్, APSPF, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు (GHA), హెలిగో చార్టర్స్ వంటి అన్ని సంబంధిత వాటాదారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో, పొగమంచు పరిస్థితుల్లో అనుసరించాల్సిన ప్రామాణిక కార్యాచరణ విధానాలు, ప్రతి విభాగం మరియు వాటాదారుల పాత్రలు, బాధ్యతలు, అలాగే ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన సమన్వయం, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాల కల్పనపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా విమానాల రాకపోకలను సురక్షితంగా, సమర్థవంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు ఈ డ్రై రన్ ఎంతో ఉపయోగపడుతుందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎన్.కె. శ్రీకాంత్ తెలిపారు. భారత విమానాశ్రయాల అథారిటీ ప్రయాణీకులకు సురక్షితమైన మరియు నాణ్యమైన విమానాశ్రయ సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News