విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 10న బాలోత్సవ్ భవన్లో జరిగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పోస్టర్ను శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు ఆవిష్కరించారు. మహిళాదినోత్సవం సందర్భంగా వారిలో ఉండే టాలెంట్ ను ప్రోత్సహించేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. మహిళా సమానత్వం సాధించిన నాడే దేశం ముందుకు పోతుందని, ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా మహిళల్లో దాగివున్న ప్రజ్ఞ ప్రపంచానికి తెలుస్తుందని కలెక్టర్ అన్నారు.
ఫోరం ఫర్ ఆర్టిస్ట్, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతోందని నిర్వాహకలు ఎ. సంధ్యారాణి, కె. స్వరూపరాణి, జి. జ్యోత్స్న తెలిపారు. 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బాలోత్సవ భవన్లో ఎగ్జిబిషన్ ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం 3.30 గంటలకు బెస్ట్ ఫ్రం వేస్ట్ క్రాఫ్ట్ డెమో కార్యక్రమాన్ని స్వాతి పూర్ణిమ, పేపర్ క్విల్లింగ్ కార్యక్రమాన్ని మేడా రజని ప్రారంభిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, అతిధుల ప్రసంగాలు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహుకులు తెలిపారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఫోరంఫర్ ఆర్టిస్ట్ అధ్యక్షులు ఎ. సునీల్ కుమార్, ప్రియాంక, లలితా సౌజన్య, సేఫ్ ప్రెసిడెంట్ జి. జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News