విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర, అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య పోరాటంలో తన ప్రాణాలను అర్పించి, దేశానికి అపూర్వమైన స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. దేశభక్తి, ధైర్యసాహసాల పరాకాష్ఠగా నిలిచిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి యువత అతని స్ఫూర్తిని అనుసరించి దేశసేవలోకి ముందుకు రావాలని, ప్రజల సేవ చేయడం ద్వారా నిజమైన దేశభక్తిని చాటాలని ఆమె పిలుపునిచ్చారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు మన దేశ చరిత్రలో స్వాతంత్ర్య సమరయోధుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అతని ధైర్యం, త్యాగం, దేశభక్తి మనకు ఎప్పటికీ పాఠాలుగా ఉంటాయి. అటువంటి మహానుభావుడికి నివాళులు అర్పించడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పి. సత్యనారాయణ, పి. సత్యకుమారి, అకౌంట్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, ఇతర విఎంసి సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. వారు కూడా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు.
Prajavartha Online Telugu News