-భీమవరం లో పాల సేకరణ భవనం ప్రారంభోత్సవం
-ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హాజరు
-నాలుగు రూరల్ నియోజకవర్గాల్లో నెల రోజుల్లో యానిమల్ హాస్టల్స్ నిర్మాణం
-మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల సంక్షేమం తో పాటు పాడి పారిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు, రైతులకు లబ్ధి కలిగే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు పథకాలు రూపకల్పన చేయటం జరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన పాల సేకరణ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాల సేకరణ భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.3.75 లక్షలు, కృష్ణ మిల్క్ యూనియన్ నుంచి రూ.0.50 లక్షలు మంజూరు కాగా, మొత్తం రూ.4,25,000 వ్యయంతో ఈ భవనం నిర్మాణం జరిగింది.
ఈ పాల సేకరణ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , ఏపీ స్టేట్ విజయా మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ నూతన పాల సేకరణ భవనాన్ని ప్రారంభించారు.
ముందుగా గ్రామంలోని దివంగత మహానేత నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ గ్రామీణ పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడం, పాల ఉత్పత్తిదారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మిచంటం జరిగిందన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఒకే రోజు భీమవరం, మక్కపేట గ్రామాల్లో కృష్ణ మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మించిన పాల సేకరణ కేంద్రాలు ప్రారంభించటం ఎంతో ఆనందంగా వుందన్నారు.
గత ప్రభుత్వంలో అమూల్ డైరీ వల్ల విపరీతమైన పోటీ వచ్చినా కూడా పాడి రైతులు నిరాశపడకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపి కృష్ణ మిల్క్ యూనియన్ కూడా ఎక్కడ అదైర్యపడకుండా ముందుసాగిందన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ కు అండగా వున్న రైతులకు అభినందనలు తెలిపారు. అభివృద్ది సంక్షేమ సమపాళ్లలో ముందుకు తీసుకువెళుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యానిమల్ హాస్టల్ నిర్మించాలని జీవో ఇచ్చిందని, ఆ జీవో ప్రకారం జిల్లాలోని నాలుగు రూరల్ నియోజకవర్గాల్లో నెల రోజుల్లో యానియల్ హాస్టల్స్ నిర్మాణం పూర్తిచేసి ఇతర నియోజకవర్గాలకు స్పూర్తి వుండేలా కృషి చేస్తామన్నారు. రైతులకు ఏ ఇబ్బంది వున్నా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తో కలిసి అండగా వుండి వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పాడి పరిశ్రమ, గ్రామీణాభివృద్ధి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాడి రైతులు, వ్యవసాయదారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. వ్యవసాయం–పాడి పరిశ్రమ శాఖల సమన్వయంతో రైతుల ఆదాయాన్ని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ వెన్నెముక వంటిదని, రైతులు మరియు పాల ఉత్పత్తిదారులకు న్యాయమైన ధర లభించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ పాల సేకరణ భవనం ప్రారంభంతో పాల విక్రయంలో సౌలభ్యం పెరగడమే కాకుండా గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని అన్నారు._
ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, కృష్ణా మిల్క్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, జనరల్ మేనేజర్ డాక్టర్ పారి, కృష్ణ మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఇంజం రామారావు, నెలకుదుతి నాగేశ్వరరావు, చిల్లకల్లు పాలశీతలీకరణ మేనేజర్ బోజంకి నరేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల గాంధీలతో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News